‘మీన్ తూటాల’తో ఉగ్ర దాడులు | Terror attacked by terrorists with Meen bullets | Sakshi
Sakshi News home page

‘మీన్ తూటాల’తో ఉగ్ర దాడులు

Feb 26 2015 3:01 AM | Updated on Sep 2 2017 9:54 PM

సద్దాం హుస్సేన్ (పాతచిత్రం)

సద్దాం హుస్సేన్ (పాతచిత్రం)

హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ఇం డియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు ‘మీన్ తూటాల’ను వినియోగించినట్లు తాజాగా బయటపడింది.

* చేపల వేట పేలుడు పదార్థంతోనే పేలుళ్లు
* హైదరాబాద్ సహా ఐదు చోట్ల పేలుళ్లకు ఐఎం వాడింది ఇవే
* బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి

 
 బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్: హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు ఇం డియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు ‘మీన్ తూటాల’ను వినియోగించినట్లు తాజాగా బయటపడింది. కర్ణాటకలోని తీర ప్రాంత మత్య్సకారులు చేపలవేటకు అక్రమంగా ఉపయోగించే పేలుడు పదార్థాన్నే ఉగ్రవాదులు  వాడిన విషయం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచి హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ సహా పుణే, ముంబై, బెంగళూరుల్లో జరిగిన ఐదు పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారీకి ‘మీన్‌తూటా’లను సేకరించినట్లు బెంగళూరు సీసీబీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
 
 అఫాఖీ కీలక పాత్ర: దేశంలో విధ్వంసానికి కుట్రపన్నిన ఐఎం చీఫ్ రియాజ్ భత్కల్ ఇందు లో భాగంగా వివిధ నగరాల్లో పేలుళ్లకు వ్యూహ రచన చేశాడు. పేలుళ్లకు అవసరమైన పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను 2010 నుంచి ఐఎం పేలుడు పదార్థం సరఫరా బృం దం (ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్) చీఫ్‌గా వ్యవహరిస్తున్న హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 2009 వరకూ దేశంలో పేలుళ్లకు స్వయంగా అమ్మోనియం నైట్రేట్‌ను సేకరించిన రియాజ్ భత్కల్...తన కోసం తొమ్మిది రాష్ట్రాల పోలీసులు గాలిస్తుండటంతో మకాం పాకిస్తాన్‌కు మార్చాడు. ఈ నేపథ్యంలో పేలుడు పదార్థం సరఫరా బాధ్యతను అఫాఖీకి అప్పగించాడు. అఫాఖీ  పాక్ యువతిని పెళ్లాడటం, తరచూ పాక్ వెళ్లొస్తుండటంతో అతన్ని ఈ‘పని’ కోసం ఎంచుకున్నాడు.
 
 ‘మీన్ తూటాల’పై కన్ను: భత్కల్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అఫాఖీ పేలుడు పదార్థాల సేకరణకు అనేక మార్గాలు అన్వేషించి చివరకు ‘మీన్ తూటాల’పై కన్నేశాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతోపాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ  ప్యాకెట్‌లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైర్ జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్నకుండలో పెట్టి కాస్త బరువుతో పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి వెలువడే షాక్ వేవ్స్ ప్రభావంతో చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. దీన్నే మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. ఇది నిషిద్ధం.
 
 స్క్రాప్ వ్యాపారి సద్దాం ద్వారా సరఫరా...
 కర్ణాటకలో మైనారిటీల అభివృద్ధి కోసం పనిచేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ)లో సభ్యుడైన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌ను అఫాఖీ  పావుగా వాడుకున్నాడు. అతని ద్వారా మీన్ తూటాలను తెప్పిం చుకునేవాడు. స్నేహితులతో కలసి చేపల వేట కు వెళ్లేందుకంటూ సద్దాం చేత ఉడిపి, రత్నగిరిల నుంచి ‘మీన్ తూటాలు’ తెప్పించేవాడు. ఈ  జనవరి 26న భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన రియాజ్ భత్కల్ దాని కోసం అఫాఖీ ద్వారా 8 కేజీల పేలుడు పదార్థం, 100 డిటోనేటర్లు  సమీకరించాడు. కానీ ఆలోపే అఫాఖీ సహా సద్దాం తదితరులు అరెస్టు కావడంతో పోలీ సులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement