కార్పొరేటర్‌కు కరోనా.. కఠిన చర్యలు తప్పవు!

Srinagar Corporator Tested Covid 19 Positive In Trouble Now - Sakshi

సోదరుడి ప్రయాణ చరిత్రను దాచిన శ్రీనగర్‌ కార్పొరేటర్‌

శ్రీనగర్‌: కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఓ ప్రజాప్రతినిధి తానే నిబంధనలను తుంగలో తొక్కాడు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన సోదరుడి వివరాలు దాచిపెట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యాడు. ప్రస్తుతం పోలీసులు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటన కశ్మీర్‌లో చోటుచేసుకుంది. వివరాలు... శ్రీనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్‌ మాజిద్‌ షులూకు మంగళవారం కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడి నివాసానికి చేరుకోగా... కార్పొరేటర్‌ సోదరుడు ఇటీవలే ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు వచ్చినట్లు గుర్తించారు. అతడు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి దొంగతనంగా ఓ ట్రక్కులో ఇంటికి చేరుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో మాజిద్‌తో పాటు అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు.(కరోనా.. 49 వేలు దాటిన కేసులు)

ఈ విషయం గురించి జిల్లా అభివృద్ధి కమిషనర్‌ షాహిద్‌ చౌదురి మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని వారాలుగా కరోనా వ్యాప్తిని నియంత్రణ చేయగలిగాం. అయితే ప్రయాణ చరిత్రను దాచి.. కొంతమంది వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’అని తెలిపారు. కాగా కార్పొరేటర్‌కు కరోనా సోకినట్లు తేలడంతో ఎస్‌ఎంసీ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ మేయర్‌ జునైద్‌ మట్టు విజ్ఞప్తి చేశారు. ఇక కార్పొరేటర్‌ మాజిద్‌ను కలిసిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎస్‌ఎంసీ కమిషనర్‌ గజాన్‌ఫర్‌ అలీ సూచించారు.    (ముఖ్య‌మంత్రి డ్రైవ‌ర్‌కు క‌రోనా; అప్ర‌మత్త‌మైన అధికారులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top