రాజ్యసభలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల వాగ్యుద్ధం | Spat between Seemandhra, Telanagana MPs in Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల వాగ్యుద్ధం

Aug 13 2013 4:25 AM | Updated on Sep 1 2017 9:48 PM

తెలంగాణ నిర్ణయంపై సోమవారం రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చ సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య పలు సందర్భాల్లో తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది.

తెలంగాణ నిర్ణయంపై సోమవారం రాజ్యసభలో జరిగిన సుదీర్ఘ చర్చ సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య పలు సందర్భాల్లో తీవ్ర వాగ్వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్ అత్యంత నిరంకుశ ధోరణితో తీసుకున్న తెలంగాణ నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందని చర్చను ప్రారంభించిన సుజనా చౌదరి (టీడీపీ) విమర్శించారు. ఈ నిర్ణయం న్యాయపరీక్షకు నిలిచే అవకాశం లేదన్నారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు.
 
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలతో క్విట్‌ఇండియా ఉద్యమంలో భాగంగా ముందుకొచ్చిన భాషాప్రయుక్త రాష్ట్రాలను ఇప్పుడు తెలంగాణ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ ఇండియా ఉద్యమంగా మారుస్తోందన్నారు. తెలంగాణ నిర్ణయం అంతిమంగా అతి త్వరలోనే దేశ విభజనకు దారి తీసే ప్రమాదముందని హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. సమయాభావం ఉదంటూ ప్రసంగం ముగించాల్సిందిగా చౌదరికి డిప్యూటీ చైర్మన్ సూచించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంత పెద్ద సమస్యపై తాను చెప్పదలుచుకున్నదంతా చెబుతానంటూ చౌదరి భీష్మించారు. విపక్ష నాయకులంతా ఆయనకు మద్దతుగా సభాధ్యక్షునితో వాదనకు దిగడంతో సభ అరగంట పాటు వాయిదా పడింది.

Advertisement
 
Advertisement
Advertisement