మేకిన్‌ ఇండియాలో కదలిక | Modi's Make in India may get $6 billion cheque from Lotte, Peugeot | Sakshi
Sakshi News home page

మేకిన్‌ ఇండియాలో కదలిక

Nov 23 2017 3:01 PM | Updated on Aug 15 2018 2:32 PM

Modi's Make in India may get $6 billion cheque from Lotte, Peugeot  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్‌ ఇండియాలో పెట్టుబడులు ఊపందుకోనున్నాయి. దక్షిణాఫ్రికా వాణిజ్య దిగ్గజం లొట్టె గ్రూప్‌, ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ గ్రూప్‌ పీజెట్‌ ఎస్‌ఏ భారీ పెట్టుబడులతో భారత్‌లో ప్లాంట్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఇరు సంస్థలు కలిసి దాదాపు  40,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలపై కసరత్తు సాగుతోంది.రానున్న ఐదేళ్లలో లొట్టె రూ 20 వేల కోట్ల నుంచి 30వేల కోట్ల వరకూ వెచ్చించాలని సన్నాహాలు చేస్తోంది.

రిటైల్‌, కెమికల్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికాకు చెందిన లొట్టె గ్రూపు యోచిస్తోంది. దేశంలో రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లను డెవలప్‌ చేసి వాటిని నిర్వహించడంపైనా ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. పీజెట్‌, సిట్రోన్‌ కార్ల తయారీ సంస్థ పీఎస్‌ఏ గ్రూప్‌ దక్షిణాదిలో రూ 7వేల కోట్లతో కారు ఫ్యాక్టరీ, ఇంజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంపై చర్చలు జరుపుతోంది.

భూమి కేటాయింపులు, రాయితీలు, సత్వర అనుమతులతో విదేశీ కంపెనీలను భారత్‌లో తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ చర్యలు వరల్డ్‌ బ్యాంక్‌ వ్యాపార సరళతర సర్వేలో భారత్‌ మెరుగైన ర్యాంక్‌ సాధించేందుకు, ఇటీవల మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు దోహదపడ్డాయని అధికారులు చెబుతున్నారు. భారత్‌ సహా పలు దేశాల్లో వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు వాణిజ్య అవకాశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనిపై తుది నిర్ణయం వెలువడలేదని లొట్టె ఓ ప్రకటనలో పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement