
ప్రతీకాత్మకచిత్రం (సోర్స్ గూగుల్)
న్యూఢిల్లీ: ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రద్దుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తమ విభాగాల్లో భర్తీచేయని ఉద్యోగాలకు సంబంధించి సమగ్ర నివేదికలు సమర్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఐదేళ్లకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, వాటి రద్దుకు తీసుకున్న చర్యలు వివరిస్తూ నివేదికలు ఇవ్వాలని పలు విభాగాల ఉమ్మడి కార్యదర్శులకు ఆర్థిక శాఖ జనవరి 16న మెమొరాండం పంపింది.
ఈ మేరకు కొన్ని శాఖలు, విభాగాలు ఇప్పటికే నివేదికలు సమర్పించగా, మరికొన్ని కొంత సమాచారం మాత్రమే అందించాయి. ఆ తరువాత హోం మంత్రిత్వ శాఖ కూడా తన పరిధిలోని అదనపు కార్యదర్శులు, ఉమ్మడి కార్యదర్శులతో పాటు పారామిలటరీ బలగాల చీఫ్లు, ఇతర అనుబంధ సంస్థలకు ఇలాంటి ఆదేశాలే జారీచేస్తూ నివేదికలు కోరిందని ఆ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.