నోట్ల కిలాడీ అరెస్ట్‌ | Lotha arrested by Enforcement Directorate | Sakshi
Sakshi News home page

నోట్ల కిలాడీ అరెస్ట్‌

Dec 23 2016 1:11 AM | Updated on Sep 5 2018 1:38 PM

రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్‌కతా వ్యాపారి పరాస్‌ ఎం లోథాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రూ. 25 కోట్ల నోట్ల మార్పిడి  వ్యవహారంలో....
పారిపోతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకున్న ఈడీ


న్యూఢిల్లీ/రాయ్‌పూర్‌: రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్‌కతా వ్యాపారి పరాస్‌ ఎం  ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోధాపై అంతకుముందే లుకౌట్‌ నోటీసు జారీ కాగా... ముంబై ఎయిర్‌ పోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సిబ్బంది బుధవారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. శేఖర్‌ రెడ్డి, రోహిత్‌ టాండన్ కేసుల్లో రూ. 25 కోట్ల మేర పాత నోట్ల మార్పిడితో లోధాకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద కస్టడీ కోరుతూ అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

అస్సాంలో రూ. 2.3 కోట్ల కొత్త నోట్లు
ఐటీ అధికారులు గురువారం అస్సాంలోని నగౌన్ పట్టణంలో వ్యాపారవేత్త అముల్య దాస్‌ నుంచి రూ. 2.3 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇల్లు, వ్యాపార కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో భారీగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సీజ్‌ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఐటీ అధికారులు ఒక ఫైనాన్షియర్‌ నుంచి రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 43 లక్షల మేర కొత్త కరెన్సీగా గుర్తించారు. ఆ ఫైనాన్షియర్‌ ఎన్నడూ పన్ను చెల్లించలేదని, అలాగే ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయలేదని ఐటీ అధికారులు కనుగొన్నారు. అప్రకటిత ఆదాయం రూ. 10.3 కోట్ల వరకూ ఉన్నట్లు అతను వెల్లడించాడు.  

పార్లమెంటరీ కమిటీ ముందుకు ఉర్జిత్‌
జనవర్‌ 19న ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు అంశాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై వివరించనున్నారు. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాౖటెన స్టాండింగ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు అనంతరం పలువురు నిపుణులు ప్యానల్‌ ముందు హాజరై తమ అభిప్రాయాల్ని తెలిపినట్లు మెయిలీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement