మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు: కమల్‌నాథ్‌

Kamalnath Slams Speculations On Jyotiraditya Scindia - Sakshi

భోపాల్‌: తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటున్నారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌. మధ్యప్రదేశ్‌ రాజకీయాలలో కమల్‌నాథ్‌, జ్యోతిరాదిత్య సింధియాలకు ప్రత్యేక గుర్తుంపు ఉంది. సీఎం రేసులో ఇద్దరు ముందంజలో ఉన్నారు. అయితే అనూహ్యంగా కమల్‌నాథ్‌కు సీఎం పదవి వచ్చిన నేపథ్యంలో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ తెలపారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కమల్‌నాథ్‌ సమావేశం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిని త్వరలో ఎన్నుకోనున్నట్లు సీఎం తెలిపారు. ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియాకు కీలక పదవి ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం వైపు ఆలోచించే అవకాశం ఉందన్న విలేకరుల ప్రశ్నలకు కమల్‌నాథ్‌ స్పందిస్తూ నాకు తెలిసి అతనికి ఎవరిపైన కోపం ఉండే అవకాశం లేదని అన్నారు.

ఈ మధ్య ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సింధియా స్వాగతిస్తూనే తాను కాంగ్రెస్‌ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడబోనని స్పష్టం చేశారు. సింధియాను రాష్ట్ర రాజకీయాల నుంచి పక్కనపెడితే తనతో సహా 500మంది కార్యకర్తలు రాజీనామా చేస్తారని కాంగ్రెస్‌ నాయకుడు అశోక్‌ దాంగీ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తర్వాత ముఖ్యమంత్రి రేసులో ముందున్న సింధియాకు పదవి దక్కకపోగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా రాకపోవడం గమనార్హం. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రియాంకాగాంధీ వాద్రాతో నాయకత్వం వహించే అవకాశం కల్పించిందని కొందరు పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో సింధియా తన సొంత నియోజకవర్గమైన గుణాను కోల్పోయిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలిచిన ఏకైక ఎంపీ సీటు సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు లోక్‌నాథ్‌ది కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ భోపాల్‌ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. అయితే మధ్యప్రదేశ్‌ అధ్యక్ష పదవికి  అర్జున్‌ సింగ్‌ తనయుడు అజయ్‌సింగ్‌కు దిగ్విజయ్‌ మద్దతు తెలుపుతున్నారు. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే నాయకుల బాధ్యతను సింధియాకు అప్పగించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top