బలగాల బస్సును పేల్చేసిన మావోలు
ఛత్తీస్గఢ్లో ఇద్దరు జవాన్లు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు
చర్ల/రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా రెండుచోట్ల మందుపాతరలను పేల్చి ఇద్దరు జవాన్లను బలిగొన్నారు. బీజాపూర్ జిల్లాలోని పుట్రు–నమ్మేడ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న రహదారిని తనిఖీ చేసి తిరిగివస్తున్న భద్రతాబలగాల బస్సే లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డుల(డీఆర్జీ)కు చెందిన ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుల్ని రాయ్పూర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారన్నారు.