
18 నెలలుగా కొనసాగుతున్న ‘కగార్’
ఇప్పటివరకు 439 మంది మావోయిస్టుల మృతి
మావోయిస్టుల ప్రతిదాడిలో 93 మంది మృత్యువాత
38 నుంచి 11 జిల్లాలకు తగ్గిన ప్రాబల్యం
తెలంగాణలో సంచలనంగా మారిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర సర్కారు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ కారణంగా.. బస్తర్ అడవుల్లో తరచూ తుపాకులు గర్జిస్తున్నాయి. వందలాది మంది చనిపోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని కర్రిగుట్టల్లో చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తెలంగాణలోనూ చర్చనీయాంశమైంది.
పద్నాలుగేళ్లకు..
దేశంలోని సాయుధ విప్లవ పార్టీలన్నీ కలిసి 2004 సెప్టెంబర్ 20న భారత కమ్యూనిస్టు పార్టీ (మావో యిస్టు)గా ఏర్పాటయ్యాయి. నేపాల్ నుంచి శ్రీలంక వరకు ప్రాంతంలో నూతన ప్రజాస్వామిక విప్లవం సాధించడమే లక్ష్యంగా రెడ్ కారిడార్ పేరుతో కదం తొక్కాయి. ఈ క్రమాన 2010 నాటికి దేశంలోని 126 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరిగిపోయింది. అప్పటి నుంచి మావోయిస్టులను అణచి వేసేందుకు ప్రభుత్వాలు అనేక ఎత్తుగడలు అమలు చేస్తూ వచ్చాయి. ఫలితంగా 2024 నాటికి మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి 38 జిల్లాలకు పడిపోయింది. దీంతో మావోయిస్టు తరహా విప్లవ పంథా అనుసరించే వారిని దేశం నుంచి ఏరివేయ డమే లక్ష్యంగా.. ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
సుప్రీం కమాండర్ ఎన్కౌంటర్ పెద్ద దెబ్బ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్లతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఛత్తీస్గఢ్తో పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశాలో చోటుచేసుకున్న వరుస ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 439 మంది మావో యిస్టులు చనిపోయారు. ఇందులో జన మిలీషియా మొదలు పార్టీ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు వరకు ఉన్నారు. చలపతి, ప్రయాగ్మాంఝీ, తెంటు సుధాకర్, గాజర్ల గణేశ్ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు పార్టీ కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రేణుక, అరవింద్, ఊర్మిల వంటి ముఖ్యనేతలు మృతి చెందారు. తెలంగాణ కమిటీ లక్ష్యంగా జరిగిన ఎన్కౌంటర్లలో మైలారపు ఆడెళ్లు అలియాస్ భాస్కర్ చనిపోగా బడే దామోదర్ వంటి నేతలు తప్పించుకున్నారు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 15 మంది మావోయిస్టులు చనిపో యారు. ఇప్పటి వరకు 1,457 మంది మావో యిస్టులు లొంగిపోగా మరో 1,469 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తంగా 3,500 మంది వరకు సాయు ధ విప్లవ పోరాట పంథాకు దూరమయ్యారు. మొత్తంగా కగార్ ప్రభావంతో మావోయిస్టు ప్రభా విత జిల్లాల సంఖ్య 38 నుంచి 11కు పడిపోయింది. ఈ జిల్లాల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు ఉన్నాయి.
హైలైట్గా కర్రిగుట్టలు
ఆపరేషన్ కగార్ మొదలయ్యాక మే 21న ఛత్తీస్ గఢ్లోని నారాయణపూర్ జిల్లా గుండెకోట్ దగ్గర జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు చనిపోవ డం పోలీసులు సాధించిన అతిపెద్ద విజయంగా చెబుతారు. ఆ తర్వాత స్థానం తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టలపై 21 రోజుల పాటు భద్రతా దళాలు కొనసాగించిన ఆపరేషన్ బ్లాక్ ఫారె స్ట్కు దక్కుతుంది. సెంట్రల్ రీజనల్ బ్యూరో, తెలంగాణ, దండకారణ్య కమిటీలతో పాటు మోస్ట్ వాంటెడ్ హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగింది. ఇక్కడ చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే అగ్రనేతలెవరూ భద్రతా దళాలకు చిక్కలేదు. కానీ మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న కర్రిగుట్టలు పోలీసుల అధీనంలోకి వచ్చాయి. అంతకుముందు అక్టోబర్ 4న అబూజ్మడ్ అడవుల్లో జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. సంఖ్యాపరంగా దేశంలో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా నిలిచింది. ఇదే సమయాన మావోయిస్టు ప్రభావిత బీజాపూర్, సుక్మా జిల్లాల్లో రికార్డు స్థాయిలో 72 కొత్త మొబైల్ నెట్వర్క్ టవర్లను నెలకొల్పారు.
ప్రతిపాదనలకే పరిమితం
ఆపరేషన్ కగార్ ఉధృతం కావడంతో మార్చి 28న మావోయిస్టులు శాంతి చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణలో మెజార్టీ రాజకీయ పక్షాలు ఈ శాంతిచర్చల నిర్ణయాన్ని స్వాగతించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలపై సానుకూలంగా ఒక్క ప్రకటనా చేయలేదు. పైగా చర్చలపై భేటీలు జరుగుతుండగానే.. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో అతి పెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ సమయంలోనే నంబాలతో పాటు అనేక మంది అగ్రనేతలు నేలకొరిగారు. దీంతో శాంతి చర్చల అంశం ఒకేవైపు ప్రతిపాదనలకే పరిమితమైందనే భావన నెలకొంది.
కర్రిగుట్టలపై వినతికి ఏడాది
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రి గుట్టలను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు తమ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తు న్నారని, వీటిని అడ్డుకోవాలని కోరుతూ 2024 జూలై 4న కేంద్ర హోంమంత్రి అమిత్షాకు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపై వారిద్దరి మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. ఇందులో మావో యిస్టుల రాకను అడ్డుకునేలా.. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా కొండవాయి, ములుగు జిల్లా ఆలుబా కలో జాయింట్ టాస్క్ఫోర్స్ (జేటీఎఫ్) క్యాంపులు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు, కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలను కూడా మావో యిస్టు ప్రభావిత జిల్లాలను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ సూచనల ప్రకారం జేటీ ఎఫ్ క్యాంపులు, మావోయిస్టు ప్రభావిత గుర్తింపు ఇవ్వడంపై సానుకూల ప్రకటనలు రాలేదు. కానీ కర్రిగుట్టలపై పట్టు సాధించేలా భద్రతా దళాలు ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఈ ఏడాది మే 15 నాటికి విజయం సాధించాయి.