వంతెనపై చిక్కుకున్న జాలర్లు.. ఎయిర్‌ఫోర్స్‌ సాహసం! | Indian Air Force Rescue Of Two People At Tawi River In Jammu Kashmir | Sakshi
Sakshi News home page

వంతెనపై చిక్కుకున్న జాలర్లు.. ఎయిర్‌ఫోర్స్‌ సాహసం!

Aug 19 2019 4:32 PM | Updated on Aug 19 2019 7:29 PM

Indian Air Force Rescue Of Two People At Tawi River In Jammu Kashmir - Sakshi

జమ్మూ : భారత వైమానిక దళం చూపిన దైర్య సాహసాలకు అందరూ శభాష్‌ అంటున్నారు. ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తుంండటంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని తావి నదిలోకి భారీ వరద చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తుంది. అదే సమయంతో నదిలోకి  చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు అకస్మాత్తుగా నదీ ప్రవాహం పెరగడంతో సమీపంలోని నిర్మాణంలో ఉన్న వంతెనపై చిక్కుకుపోయారు. నలుగురిలో ఇద్దరు ఎలాగోలా కష్టపడి నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మిగతా ఇద్దరు అలాగే ఉండిపోయారు. దీంతో తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు.

వెంటనే స్పందించిన భారత వైమానిక దళం రెస్య్కూ ఆపరేషన్‌ మొదలుపెట్టింది. హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్లి.. వంతెనపై బిక్కుబిక్కుమంటున్న ఆ ఇద్దరిని రక్షించింది. ఆపద సమయంలో స్పందించి వీరోచితంగా ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఎయిర్‌ ఫోర్స్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక, దేశంమంతా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, కేరళతో పాటు ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement