వీడనున్న ‘స్విస్‌’ లోగుట్టు | India to get Swiss banking details of Indians | Sakshi
Sakshi News home page

వీడనున్న ‘స్విస్‌’ లోగుట్టు

Sep 1 2019 3:43 AM | Updated on Sep 1 2019 3:43 AM

India to get Swiss banking details of Indians - Sakshi

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయులకు సంబంధించిన ఖాతాల వివరాలు నేటి నుంచి భారతీయ పన్ను అధికారులకు అందుబాటులోకి రానున్నాయి. ఇరుదేశాల ఆటోమేటిక్‌ సమాచార మార్పిడి ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుండటంతో స్విస్‌ ఖాతాల వివరాలు భారత్‌కు తెలియనున్నాయి. నల్లధనంపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇది దోహదపడుతుందని, దీంతో స్విస్‌ బ్యాంకుల లోగుట్టు శకం ఎట్టకేలకు ముగిసినట్లు అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) తెలిపింది. దీనిపై సీబీడీటీ ఆదాయపు పన్ను విభాగానికి ఓ విధానాన్ని రూపొందించింది.

స్విట్జర్లాండ్‌ అంతర్జాతీయ ఫైనాన్స్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారి నికోలస్‌ మారియో ఈనెల 29, 30 తేదీల్లో భారత రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే, సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోదీలతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఆర్థిక ఖాతాల సమాచార మార్పిడి కార్యక్రమం సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. పన్నుకు సంబంధించిన భారత్‌ కోరిన కొన్ని ప్రత్యేక కేసుల సమాచార మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ఇరుదేశాల అధికారులు చర్చించారు. స్విట్జర్లాండ్‌లో 2018 సంవత్సరంలో భారతీయులు నిర్వహించిన అన్ని ఆర్థిక లావాదేవీల వివరాలను భారత్‌ అందుకుంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో 2018లో క్లోజ్‌ అయిన ఖాతాల వివరాలు కూడా ఉంటాయని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement