అయోధ్య వివాదంలో సీనియర్‌ ఐపీఎస్‌..  | Sakshi
Sakshi News home page

అయోధ్య వివాదంలో సీనియర్‌ ఐపీఎస్‌.. 

Published Fri, Feb 2 2018 6:51 PM

UP Home Guard Director vows to build Ram temple in Ayodhya, stokes controversy - Sakshi

సాక్షి, లక్నో : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆవేశంలో నోరుజారి ఆ తర్వాత నాలికకరుచుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని ప్రతిన బూనిన యూపీ హోంగార్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌ సూర్యకుమార్‌ శుక్లా వివాదానికి కేంద్రబిందువయ్యారు. లక్నోయూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు ముస్లిం నేతలతో కలిసి ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ముస్లిం కార్య సేవా మంచ్‌ అధ్యక్షుడు ఆజం ఖాన్‌ సహా పలువురు ముస్లిం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శుక్లా దిద్దుబాటు వ్యాఖ్యలు చేశారు.

ఏకాభిప్రాయంతోనే రామాలయ నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని మతాల వారి సమ్మతితో ప్రశాంత వాతావరణంలో మందిర నిర్మాణం జరగాలన్న సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. 1982 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన శుక్లా యూపీ డీజీపీ రేసులో ఉండటం గమనార్హం. మరోవైపు రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు తుది విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement