డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది | Five Moradabad Stone Pelting Accused Tested Corona Positive | Sakshi
Sakshi News home page

రాళ్ల దాడి చేసిన వారికి కరోనా

Apr 21 2020 8:15 PM | Updated on Apr 21 2020 8:26 PM

Five Moradabad Stone Pelting Accused Tested Corona Positive - Sakshi

వైద్య సిబ్బంది, పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది.

మొరదాబాద్‌: వైద్య సిబ్బంది, పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురికి కరోనా వైరస్‌ సోకింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌ జిల్లాలో ఈ నెల 15న ఈ దాడి జరిగింది. ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులతో పాటు 10 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఐదుగురు కోవిడ్‌ బారిన పడినట్టు మొరదాబాద్‌ ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ఎంసీ గార్గ్‌ మంగళవారం వెల్లడించారు. ‘జైలు నుంచి 11 నమూనాలు పరీక్షల కోసం పంపించగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 10 మంది కరోనా హాట్‌స్పాట్‌కు చెందిన వారు. వైద్య, పోలీసు సిబ్బందిపై రాళ్లు విసిరిన కేసులో వీరు నిందితులు. ఒక వ్యక్తి మరో కేసులో అరెస్టయ్యాడు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ క్వారంటైన్‌ చేస్తామ’ని డాక్టర్‌ గార్గ్‌ చెప్పారు. (పాపం.. కరోనా కాటుకు డాక్టర్‌ మృతి)

కోవిడ్‌-19 మృతుడి కుటుంబ సభ్యులను తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌లో వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసులపై ఈ నెల 15న స్థానికులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. నేషనల్‌ సెక్యూరిటి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని,  ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1294 కరోనా పాజిటివ్‌ నమోదు కాగా, 20 మంది మృతి చెందారు. 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

లాక్‌డౌన్‌: కేంద్రం వివాదాస్పద ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement