
‘ఆప్’లో ఆరని అగ్గి..!
ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో రాజుకున్న అగ్గి ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు...
ఎమ్మెల్యేలను కొనేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)లో రాజుకున్న అగ్గి ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ తాజాగా ఆప్ మాజీ ఎమ్మెల్యే ఒకరు విడుదల చేసిన ఆడియో టేప్ పెను దుమారాన్ని రేపింది. గత ఏడాది ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేజ్రీవాల్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారని ఆప్ మాజీ ఎమ్మెల్యేరాజేశ్గార్గ్ బుధవారం ఆరోపించారు. ‘మనం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధం గా ఉన్నాం.
కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. మనీశ్ కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నారు. నువ్వు ఒక పని చెయ్యి. కాంగ్రెస్ని విడగొట్టు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొత్త పార్టీ ఏర్పాటు చేసి మనకు మద్దతు ఇవ్వమని చెప్పు’ అని కేజ్రీవాల్ తనతో మాట్లాడిన ఆడియోటేప్ను గార్గ్ బహిర్గతం చేశారు. అప్పట్లో కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధపడలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలును తాను వ్యతిరేకించానని, అప్పటి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లడం మానేశానని చెప్పారు.
అంజలీ దమానియా రాజీనామా
మహారాష్ట్ర ఆప్ నేత అంజలీ దమానియా పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో పార్టీ బేరసారాలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. బుధవారం ట్వీటర్ ద్వారా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కేజ్రీవాల్.. ఎమ్మెల్యేల బేరసారాలకు పాల్పడ్డారని ఓ చానెల్ ప్రసారం చేసిన ఆడియో క్లిప్ను ఆమె తన ట్వీట్కు జతపరిచారు.
ఎమ్మెల్యేల సంతకాల సేకరణ..
పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న యోగేంద్ర యాదవ్, ప్రశాంత్భూషణ్, శాంతి భూషణ్లను ఆప్ నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిపై కఠిన చర్య తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ కరావల్ నగర్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేత్వత్వంలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది.
యాదవ్, భూషణ్ల బహిరంగ లేఖ
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తమపై వచ్చిన ఆరోపణలను ఆప్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లు ఖండించారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విమర్శించారు. వారిద్దరూ ఈ మేరకు బుధవారం సంయుక్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు ఓ బహిరంగ లేఖ రాశారు. తమపై వచ్చిన అన్ని ఆరోపణలకూ అంశాల వారీగా వివరిస్తూ వారు లేఖలో వివరణ ఇచ్చారు. ఏదేమైనా, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. వ్యక్తుల కన్నా సంస్థే గొప్పదని పేర్కొన్నారు. పార్టీ కన్వీనర్ పదవిపై యాదవ్ కన్నేశారన్నఆరోపణలనూ వారు ఖండించారు.