నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ | Delhi HC Rejects Rahul Gandhis Plea To Restrain Media From Reporting | Sakshi
Sakshi News home page

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ

Aug 8 2018 4:46 PM | Updated on Aug 8 2018 4:46 PM

Delhi HC Rejects Rahul Gandhis Plea To Restrain Media From Reporting - Sakshi

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌కు ఊరట ఇవ్వని ఢిల్లీ హైకోర్టు..

సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌ను నిలువరించాలన్న రాహుల్‌ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా లావాదేవీలకు సంబంధించి తన పన్ను అసెస్‌మెంట్‌ను తిరిగి పరిశీలించాలన్న ఆదాయపన్ను ఉత్తర్వులను రాహుల్‌ గాంధీ హైకోర్టులో సవాల్‌ చేశారు.

అసోసియేట్‌ జర్నల్‌కు ఏఐసీసీ రూ 99 కోట్లు ఇచ్చిందని, యంగ్‌ ఇండియాలో డైరెక్టర్‌ పదవి వివరాలను రాహుల్‌ ఉద్దేశపూర్వకంగా వెల్లడించలేదని ఆదాయ పన్ను శాఖ హైకోర్టుకు నివేదించింది. అయితే ఈ పదవి ద్వారా రాహుల్‌ ఎలాంటి ఆదాయం పొందనందున పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని రాహుల్‌ న్యాయవాది స్పష్టం చేశారు.

కాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి నేషనల్‌ హెరాల్డ్‌ కేసును తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సోనియా, రాహుల్‌ వారి కంపెనీలకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్‌ పార్టీ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు రూ 90.25 కోట్ల వడ్డీలేని రుణాన్ని మంజూరు చేసిందని తన పిటిషన్‌లో ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement