
'మా నాయకుడి ఇమేజ్ దెబ్బ తీయలేరు'
రాహుల్ గాంధీ పౌరసత్వ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ పౌరసత్వ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించడంపట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇలాంటి చర్యలతో రాహుల్ ఇమేజ్ మసకబరచాలని ప్రయత్నిస్తున్నారేమోగాని అదెప్పటికీ జరగదని అని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇది ముమ్మాటికి ప్రతిపక్షంపై అధికార పక్షం చేసిన కుట్రే అని ఆయన మండిపడ్డారు.
'ఎథిక్స్ కమిటీకి రాహుల్గాంధీ పౌరసత్వం అంశాన్ని గుడ్డిగా అప్పగించింది. న్యాయపరమైన ఆలోచన లేకుండా ఈ పనిచేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా చేసిన ఈ చర్య కచ్చితంగా ఖండించదగినది. ఈ చర్యతో రాహుల్ ఇమేజ్ దెబ్బతీయాలని అనుకుంటున్నారేమో.. అది ఎప్పటికీ సాధ్యం కాదు' అని ఆజాద్ అన్నారు. బ్రిటన్లోని ఓ కంపెనీకి సంబంధించిన దస్తావేజులపై రాహుల్ గాంధీ తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారని ఆరోపిస్తూ ఎథిక్స్ కమిటీ ఇటీవల నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.