
న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రంలో బెంగాలీ పత్రిక ‘షాన్దాన్ పత్రిక’ జర్నలిస్టు సుదీప్దత్త భౌమిక్ హత్యను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. తన అవినీతిపై కథనాలు ప్రచురించినందుకు ప్రతీకారంగా త్రిపుర స్టేట్ రైఫిల్స్(టీఎస్ఆర్) కమాండెంట్కు బాడీగార్డుగా పనిచేస్తున్న నంద రెయాంగ్ అనే కానిస్టేబుల్ సుదీప్ను మంగళవారం కాల్చిచంపిన సంగతి తెలిసిందే.
పాత్రికేయుడిని కానిస్టేబుల్ హత్య చేయడం తీవ్రమైన విషయమని ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్ బుధవారం వ్యాఖ్యానించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రెండు నెలల్లోపే త్రిపురలో జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. ఇలాంటి హత్యలతో పాత్రికేయుల్లో అభద్రతాభావం పెరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడులకు ఉసిగొల్పుతున్న ఈ హింసావాతావరణాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.