breaking news
Akila Urankar
-
జర్నలిస్టు హత్యను ఖండించిన ఐఎన్ఎస్
న్యూఢిల్లీ: త్రిపుర రాష్ట్రంలో బెంగాలీ పత్రిక ‘షాన్దాన్ పత్రిక’ జర్నలిస్టు సుదీప్దత్త భౌమిక్ హత్యను ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తీవ్రంగా ఖండించింది. తన అవినీతిపై కథనాలు ప్రచురించినందుకు ప్రతీకారంగా త్రిపుర స్టేట్ రైఫిల్స్(టీఎస్ఆర్) కమాండెంట్కు బాడీగార్డుగా పనిచేస్తున్న నంద రెయాంగ్ అనే కానిస్టేబుల్ సుదీప్ను మంగళవారం కాల్చిచంపిన సంగతి తెలిసిందే. పాత్రికేయుడిని కానిస్టేబుల్ హత్య చేయడం తీవ్రమైన విషయమని ఐఎన్ఎస్ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్ బుధవారం వ్యాఖ్యానించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రెండు నెలల్లోపే త్రిపురలో జర్నలిస్టు హత్యకు గురికావడం ఇది రెండోసారి. ఇలాంటి హత్యలతో పాత్రికేయుల్లో అభద్రతాభావం పెరిగే ప్రమాదముందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడులకు ఉసిగొల్పుతున్న ఈ హింసావాతావరణాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఐఎన్ఎస్ అధ్యక్షురాలిగా ఉరంకర్
ఈసీ సభ్యుడిగా ’సాక్షి’ డైరెక్టర్ రాజప్రసాద్ రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) నూతన అధ్యక్షురాలిగా 2017–18 ఏడాదికిగానూ బిజినెస్ స్టాండర్డ్స్ పత్రికకు చెందిన అకిల ఉరంకర్ ఎన్నికయ్యారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఐఎన్ఎస్ 78వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సొసైటీ డిప్యూటీ ప్రెసిడెంట్గా జయంత్ మమ్మెన్ మాథ్యూ (మలయాళ మనోరమకు), ఉపాధ్యక్షుడిగా శైలేష్ గుప్తా (మిడ్–డే), జనరల్ సెక్రటరీగా ఎస్పీ కౌర్, గౌరవ ట్రెజరర్గా శరత్ సక్సేనా (హిందుస్తాన్ టైమ్స్) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) సభ్యుడిగా ‘సాక్షి’ మార్కెటింగ్, అడ్వరై్టజ్మెంట్ డైరెక్టర్ కె. రాజప్రసాద్ రెడ్డి (కేఆర్పీ రెడ్డి) ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ పత్రికలకు చెందిన 41 మందిని ఎన్నుకున్నారు. నోట్లరద్దుతో వార్తాపత్రికలకు నష్టం నోట్లరద్దు కారణంగా.. వార్తాపత్రికల ఆర్థిక పరిస్థితి క్షీణించిందని ఐఎన్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది. పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. నోట్లరద్దు వల్ల అడ్వరై్టజ్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని ఐఎన్ఎస్ తాజా మాజీ ప్రెసిడెంట్ సోమేశ్ శర్మ పేర్కొన్నారు. జీఎస్టీలో వార్తాపత్రికలను వస్తువుల కేటగిరీలో చేర్చి పన్ను మినహాయింపునిచ్చినా.. పత్రికల్లో వచ్చే ప్రకటనల్ని సేవల కేటగిరీలో చేర్చి 5శాతం జీఎస్టీ విధించటం వల్ల నష్టం వాటిల్లుతోందన్నారు. ఇటీవల జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై సంఘవిద్రోహ శక్తుల దాడులనూ సొసైటీ ఖండించింది.