జీఎస్‌టీ టైంటేబుల్‌కు కేంద్రం, రాష్ట్రాలు ఓకే


న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసకొచ్చేందుకుగాను త్వరగా పన్ను రేటును నిర్ణయించి, చట్టబద్ధ ప్రక్రియను ముగించడానికి ఉద్దేశించిన ఒక టైంటేబుల్‌ను కేంద్ర ంతోపాటు అన్ని రాష్ట్రాలు గురువారం అంగీకరించాయి. అయితే పన్ను నుంచి మినహాయింపు పొందడానికి డీలర్లకు ఉండాల్సిన టర్నోవర్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పాటైన జీఎస్టీ మండలి తొలి సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో గురువారం ఢిల్లీలో జరిగింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు జీఎస్టీలో ఒక రాష్ట్రం-ఒక ఓటు సూత్రాన్ని వ్యతిరేకించాయి.



తమ రాష్ట్రాలు పెద్దవి, పరిశ్రమలు అధికంగా ఉన్నవనీ...జీఎస్టీపై అభిప్రాయం చెప్పడానికి తమకు ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కావాలని అవి కోరాయి. రాష్ట్రానికో ఓటు ఇస్తే చిన్న రాష్ట్రాలకు, తమకు తేడా ఏంటని వాదించాయి. మిగతా రాష్ట్రాలవారు ఈ డిమాండ్‌ను కొట్టిపారేశారు. డీలర్లను జీఎస్టీ పరిధి నుంచి తప్పించాలన్న డిమాండ్‌పై కూడా ఏకాభిప్రాయం రాలేదు. కొన్ని రాష్ట్రాలు రూ.10 లక్షల లోపు టర్నోవర్ ఉండే డీలర్లకు మినహాయింపులివ్వాలని కోరగా...ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు పరిమితి రూ.25 లక్షలు ఉండాలన్నాయి. సమావేశం రేపు కూడా కొనసాగనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top