తెలంగాణలో ఆంధ్రప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, సీమాంధ్రకు చెందిన మీడియా సంస్థల యాజమాన్యాలు భయం భయంగా గడుపుతున్నారని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది.
న్యూఢిల్లీ: తెలంగాణలో ఆంధ్రప్రాంతానికి చెందిన జర్నలిస్టులు, సీమాంధ్రకు చెందిన మీడియా సంస్థల యాజమాన్యాలు భయం భయంగా గడుపుతున్నారని ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియమించిన త్రిసభ్యకమిటీ అభిప్రాయపడింది. 2014 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కౌన్సిల్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను మంగళవారం సమర్పించింది. ‘మెడలు విరిచేస్తాం.. పాతర పెడతాం’ వంటి పదాలు మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ఉన్నాయని తన నివేదికలో పేర్కొంది.
తెలంగాణలో రెండు చానళ్ల ప్రసారాలు నిలిపివేయటం, రాజ్యసభలో చర్చ జరిగినా, సమాచార ప్రసార శాఖ పలుమార్లు హెచ్చరించినా, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని కమిటీ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించేలా, జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రప్రభుత్వం తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని సిఫారసు చేసింది. టీవీల ప్రసారాల నిలిపివేతపై ఆందోళనలు చేపట్టిన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని, ఈ సందర్భంగా సదరు జర్నలిస్టులకు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని రాజీవ్ రంజన్ నాగ్, కృష్ణప్రసాద్, కె.అమర్నాధ్లతో కూడిన ఈ కమిటీ తన నివేదికలో సూచించింది.