ముస్లింలకు టికెట్లు ఇవ్వం
సాక్షి, బెంగుళూర్: కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమను నమ్మరని, అందుకే తాము ముస్లింలకు టికెట్లు ఇవ్వబోమని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆయన వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు మండిపడుతున్నాయి.
‘కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. కాని మీకు ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం లేదు. కర్ణాటకలో మేము కూడా ముస్లింలకు టికెట్లు ఇవ్వం. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మరు. మమ్మల్ని నమ్మండి.. అప్పుడు మీకు టికెట్లతోపాటు ఏది కావాలంటే అది ఇస్తాం’ అని కర్ణాటకలోని కొప్పల్లో కురుబా, ఇతర మైనారిటీవర్గాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరప్ప పేర్కొన్నారు. వెనుకబడిన కురుబా సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరప్ప గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు.