పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం.. | Army Official Says No Major Pakistan Deployment Amid Standoff With China | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్వం సిద్ధం..

Jul 6 2020 2:04 PM | Updated on Jul 6 2020 5:26 PM

Army Official Says No Major Pakistan Deployment Amid Standoff With China - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు దిగితే తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ రాజు తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ అంతటి దుస్సాహసానికి పూనుకుంటుందని తాము భావించడం లేదన్నారు. అయితే తూర్పు లదాఖ్‌లోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని జమ్మూ కశ్మీర్‌లోకి పాక్‌ ఉగ్రవాదులను పంపేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గల్వాన్‌ లోయలో భారత్‌- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పాకిస్తాన్‌ భారీగా సైన్యాన్ని మోహరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన శ్రీనగర్‌ కార్స్ప్‌ కమాండర్‌ బీఎస్‌ రాజు ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.(గల్వాన్‌ లోయలో కీలక పరిణామం)

‘‘ఇప్పటి వరకైతే సరిహద్దుల వెంబడి పాక్‌ సైన్యం కదలికల్లో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. అయితే డిఫెన్స్‌ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఏదేమైనా వాళ్లకు ధీటుగా జవాబిచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌ నుంచి భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉంది. దాదాపు 300 మంది ఉగ్రవాదులు దేశంలో చొరబడేందుకు ఎదురుచూస్తున్నారనే సమాచారం ఉంది. వాళ్లను పట్టుకునేందుకు మా సైనికులు సిద్ధంగానే ఉన్నారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ దుస్సాహసానికి పాల్పడకుండా 15 కార్స్స్‌ అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది’’ అని తెలిపారు. ఇక మే నెలలో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది రియాజ్‌ నైకూను భారత్‌ మట్టుబెట్టడం గురించి ఆయన మాట్లాడుతూ.. హిజ్బూల్‌ ముజాహిద్దీన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ అని, హిజ్బుల్‌తో పాటు వివిధ ఉగ్రసంస్థలు కూడా నైకూను మిస్సవుతాయని పేర్కొన్నారు.(పాక్‌కు చైనా నుంచి 4 ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌!)

Advertisement
 
Advertisement
Advertisement