పాక్‌కు చైనా నుంచి 4 ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌! | Pakistan To Get 4 Attack Drones From China | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఆర్మ్‌డ్‌ డ్రోన్స్‌ సరఫరా చేస్తున్న చైనా!

Jul 6 2020 8:48 AM | Updated on Jul 6 2020 9:22 AM

Pakistan To Get 4 Attack Drones From China - Sakshi

దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా నాలుగు ఆర్మ్‌డ్‌ డ్రోన్లను సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది.

న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చైనా నాలుగు ఆర్మ్‌డ్‌ డ్రోన్లను సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. అత్యంత భారీ వ్యయంతో పాక్‌లో చేపట్టిన నిర్మాణాలను కాపాడుకునేందుకు వీటిని పాక్‌కు తరలిస్తున్నట్లు చెబుతోంది. అయితే భారత్‌- చైనా సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ భారత్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గల్వాన్‌ ఘటనపై అమెరికా, ఫ్రాన్స్‌, జపాన్‌ సహా పలు దేశాలు చైనా తీరుకు వ్యతిరేకంగా గళమెత్తి భారత్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. 

అదే సమయంలో భారత్‌ సైతం డ్రాగన్‌కు బదులిచ్చేందుకు అన్ని రకాలుగా సన్నద్ధమవుతోంది. చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు ఫ్రాన్స్‌ నుంచి వీలైనంత తొందరగా.. ఫ్రాన్స్‌ రఫేల్‌ యుద్ధ విమానాలను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. అంతేగాకుండా సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేయడం సహా అవసరమైతే శత్రు స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించేందుకు వీలుగా అమెరికా రూపొందించిన మీడియం మాలే(ఆల్టిట్యూడ్‌ లాంగ్‌- ఎండ్యూరెన్స్‌) ఆర్మ్‌డ్‌ ప్రెడేటర్‌ బీ- డ్రోన్‌ వినియోగంపై తనకున్న ఆసక్తి గురించి మరోసారి అగ్రరాజ్యానికి తెలియజేసింది.(భారత్‌కు పెరుగుతున్న మద్దతు!) 

ఇక అమెరికా అమెరికా సుముఖంగానే ఉన్నా.. రష్యా నుంచి భారత్‌ ఎస్‌- 400 మిసైల్‌ కొనుగోలు చేసిన నాటి నుంచి ఈ డీల్‌ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు సరిహద్దు సమీపంలో చైనా ఇప్పటికే అత్యంత సమర్థవంతమైన మిలిటరీ వర్షన్‌కు చెందిన వింగ్‌ లూంగ్‌-2 ఆర్మ్‌డ్‌ డ్రోన్‌ను ఉపయోగించడం సహా పాక్‌కు ఇప్పుడు వాటిని సరఫరా చేయడం గమనార్హం. కాగా వింగ్‌ లూంగ్‌-2 అటాక్‌ డ్రోన్‌లో గాల్లో నుంచి ఉపరితలాల మీద ఉన్న లక్ష్యాలను ఛేదించగల 12 మిసైళ్లు ఉంటాయి. (చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు)

కాగా భారత్‌ అభ్యంతరాలను పక్కనపెట్టి మరీ డ్రాగన్‌ దేశం‌.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా ఎకనమిక్‌ కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా అనుసంధానానికి వీలుగా తాను చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్‌ నిర్మాణాన్ని చైనా తలపెట్టింది. ఈ క్రమంలో చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని బలూచిస్తాన్‌లోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది. తద్వారా వాణిజ్య సంబంధాల బలోపేతంతో పాటు ఇరాన్‌ సరిహద్దుల్లో తమ సైన్యాన్ని మోహరించడం సహా... ఈ పోర్టు ద్వారా హిందూ మహా సముద్రంపై పట్టు సాధించేందుకే డ్రాగన్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టిందనే సందేహాలు ఉన్నాయి. ఇక భారత్‌తో సరిహద్దుల్లో ఇటీవల కాలంలో ఘర్షణలు పెరుగుతున్న వేళ డ్రాగన్‌ గ్వడార్‌ పోర్టు వద్ద సరికొత్త నిర్మాణాలు చేపట్టడం గమన్హాం. తాజా పరిణామాల నేపథ్యంలో యుద్ధం తలెత్తే పరిస్థితులు నెలకొంటే.. తన సైన్యాన్ని తరలించేందుకే చైనా ఈ పోర్టును మరింతగా అభివృద్ధి చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement