బిగ్బీ ! ఈ విషయం మీకు తెలియదా ?
ముంబయి : ముంబయి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుకూలంగా బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. జల్సాలోని ఆయన ఇంటి ముందే పర్యావరణ ప్రేమికులు ' సేవ్ ఆరే - సేవ్ ఫారెస్ట్' ప్లకార్డులను పట్టుకొని నినాదాలు చేశారు. ‘నా స్నేహితుడు ఒకరు అత్యవసర వైద్య నిమిత్తం తన కారును వదిలి మెట్రోలో ప్రయాణించాడు. మెట్రో ద్వారానే తన పనిని తొందరగా ముగించుకొని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అది చూసి నాకు ఆనందం కలిగింది. వీలైనన్ని వృక్షాలను పెంచడమే కాలుష్యానికి పరిష్కారం. నేను నా తోటలో వృక్షాలను పెంచుతున్నాను. మీరు కూడా ఈ పని చేయండి అంటూ’ అమితాబ్ ట్వీట్ చేశారు.
అమితాబ్ చేసిన ట్వీట్ పై ముంబయి మెట్రో ప్రధాన అధికారి అశ్విని బిడే 'కృతజ్ఞతలు బచ్చన్ జీ' అంటూ అనుకూలంగా స్పందించారు. అయితే దీనిపై పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బిగ్ బీ ! తోటల నుంచి అడవులను తయారు చేయలేమన్న చిన్న విషయం మీకు తెలియదా అంటూ’ ఆందోళన నిర్వహించారు. ముంబయిలోని మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలోని 27 వేల వృక్షాలను తొలగించాలని ముంబయి మెట్రో నిర్ణయించింది. ఇందుకు బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి పర్యావరణ ప్రేమికుల నిరసనలు కొనసాగుతున్నాయి.
T 3290 - Friend of mine had a medical emergency, decided to take METRO instead of his car .. came back very impressed .. said was faster, convenient and most efficient .. 👍
Solution for Pollution ..
Grow more trees .. I did in my garden .. have you ❤️— Amitabh Bachchan (@SrBachchan) September 17, 2019