
జయలలిత మరణానికి శశికళే కారణమని ఏఐఏడీఎంకే ఆరోపించింది.
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలితకు వైద్య చికిత్స అందకుండా శశికళ కుటుంబం అడ్డుకుందని, అధికారం చేజిక్కించుకునేందుకు జయలలిత మరణం కోసం వారు వేచిచూశారని ఏఐడీఎంకే ఆరోపించింది. అధికార దాహంతో అమ్మ(జయలలిత)కు తదుపరి చికిత్సను అందించకుండా, ఆమె మరణం కోసం శశికళ కుటుంబం వేచిచూసిందని పార్టీ అధికార పత్రిక నమదు అమ్మ పత్రిక పేర్కొంది. ప్రజల సొమ్ముతో శశికళ కుటుంబం కోట్లు గడించిందని ఆరోపించింది.
2016 డిసెంబర్లో జయలలిత మరణించిన వెంటనే శశికళ పార్టీ చీఫ్గా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే అవినీతి కేసులో ఆమె జైలు పాలవడంతో ఏఐఏడీఎంకేలో శశికళ ప్రస్ధానం ఎక్కువకాలం సాగలేదు. అనంతర పరిణామాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న నేతలు సైతం రెబెల్ నేత, ప్రస్తుత తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్సెల్వం పక్షాన చేరారు. చివరికి పార్టీ అధికారిక చిహ్నం సైతం పన్నీర్, పళనిస్వామిల వశమైంది.