ఘాతుకం: బుల్లెట్లతో తూట్లు పొడిచారు | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 15 2018 2:13 PM

Abducted Jawan Aurangzeb Dead Body Found with Bullets - Sakshi

శరీరం నిండా బుల్లెట్లతో జల్లెడగా మారిన దేహం. రంజాన్‌కు కొద్ది గంటల ముందు అపహరణకు గురైన సైనికుడు.. కొన్ని గంటల సస్పెన్స్‌ తర్వాత మృత దేహంగా కనిపించాడు. కశ్మీర్‌లో సంచలనం సృష్టించిన జవాన్‌ ఔరంగజేబ్‌ అదృశ్యం.. చివరకు విషాదాంతంగా మారింది. 

శ్రీనగర్‌: ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్‌.. సోఫియాన్‌లోని షాదిమార్గ్‌ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్‌ 44వ దళంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్‌ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని అడ్డగించిన కొందరు తమ వెంట తీసుకెళ్లారు. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరకు శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో అతని మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. 

బుల్లెట్లు దింపారు... అతని తల, మెడ భాగంలో మొత్తం బుల్లెట్లతో దింపారు. శరీరం మొత్తం జల్లెడగా మారిపోయింది. ముఖం మొత్తం చిధ్రమైపోయింది’ అని అధికారి ఒకరు. ఇక ఘటనపై కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సందించారు.‘ఇంతటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. ఔరంగజేబ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

సైన్యం ఆగ్రహం.. ఔరంగజేబ్‌ మృతి పట్ల భారత సైన్యం రగిలిపోతోంది. రంజాన్‌ నేపథ్యంలో గత నెలరోజులుగా సరిహద్దులో భారత సైన్యం సంయమనం పాటిస్తూ వస్తోంది. అయితే పాక్‌ సైన్యం, ఉగ్రవాదులు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత్‌ అల్టిమేటం ప్రకటించింది. సహనం నశిస్తేనే ఎదరు దాడులు తప్పవని హెచ్చరించింది. గత నెల రోజుల్లో ఇద్దరు ఉగ్రవాద నాయకులను సైన్యం ఎన్‌కౌంటర్‌లలో మట్టుబెట్టింది. వారిలో ఏ++ కేటగిరీ ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ భట్‌ అలియాస్‌ సమీర్‌ టైగర్‌ కూడా ఉన్నాడు. ఔరంగజేబ్‌ ఆ ఆపరేషన్‌లో పాలుపంచుకోవటం గమనార్హం. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాక్‌ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐ ఔరంగజేబును కిరాతకంగా పొట్టనబెట్టుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

మరొకరి మృతి... బందిపొర జిల్లాలో ఈ ఉదయం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతిగా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ఓ సైనికాధికారి గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement
Advertisement