కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ 3 శాతం పెంపు

3 Percent DA High For Central Govt Employees - Sakshi

జనవరి 1 నుంచే అమల్లోకి ∙కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు తీపి కబురు. వారి కరువు భత్యం(డీఏ)ను 3 శాతం పెంచుతూ కేం ద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని  మోదీ నేతృత్వంలో మంగళవారం సమావేశమైన కేబినెట్‌ ఇందుకు అంగీకరించింది. ఈ నిర్ణయంతో సుమారు 48.41 లక్షల మంది ఉద్యోగులకు, 62.03 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. ఫలితంగా 2019 జనవరి, 2020 ఫిబ్రవరి మధ్యకాలంలో ఖజానాపై సుమారు రూ. 19,864 కోట్ల భారం పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తెలిపారు.

కేబినెట్‌ మరిన్ని నిర్ణయాలు.. 

  •  తలాక్‌ ఆర్డినెన్స్, కంపెనీల చట్టం (రెండో సవరణ) ఆర్డినెన్స్, మెడికల్‌ కౌన్సిల్‌ ఆర్డినెన్స్, పోంజి పథకాల నివారణ ఆర్డినెన్స్‌కు ఆమోదం. రాజ్యసభలో సంబంధిత బిల్లు లు నిలిచిపోవడంతో ఆర్డినెన్స్‌లు తెచ్చింది. 
  • రూ.30,274 కోట్ల వ్యయంతో ఢిల్లీ–గజియాబాద్‌–మీరట్‌ మార్గంలో రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఆర్‌ఆర్‌టీఎస్‌) ఏర్పాటుకు అంగీకారం. 82 కి.మీ దూరాన్ని 60 నిమిషాల్లో చేరుకునేలా వేగవంతమైన, పర్యావరణ హితమైన రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు.
  •  2025నాటికి కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం గా నూతన ఎలక్ట్రానిక్స్‌ పాలసీసి ఓకే
  • క్యాప్టివ్‌ మైనింగ్‌(సొంత అవసరాలకు మాత్రమే వినియోగించే) ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో నిర్వహణ కంపెనీలు 25 శాతాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించేందుకు అనుమతి. 
  • చమురు, సహజవాయువు బావుల వేలానికి రెండు దశాబ్దాల క్రితం నాటి విధానం పునరుద్ధరణ. ఇందులో భాగంగా గతంలో మాదిరిగా ప్రభుత్వానికి రెవెన్యూలో నేరుగా వాటా లభించదు. కానీ ఆపరేటర్‌ సదరు క్షేత్రం నుంచి ఏడాదిలో 2.5 బిలియన్‌ డాలర్లకు పైగా అనూహ్య లాభాలు గడిస్తే మాత్రం ఆదాయం పొందుతుంది.   
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top