నేనే దర్శకుడినైతే అనసూయను.. | Sakshi
Sakshi News home page

నేనే దర్శకుడినైతే అనసూయను..

Published Fri, Nov 1 2019 2:44 PM

Vijay Deverakonda Reveal Anasuya Role in Meeku Maathrame Chepta - Sakshi

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని అంటారు. ఈ నానుడి సినిమా పరిశ్రమకు వర్తిస్తుందని హీరో విజయ్‌ దేవరకొండ నిరూపించారు. ఒకప్పుడు తనను విమర్శించిన ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్‌కు తన సినిమాలో ప్రధాన పాత్ర ఇచ్చి తాను పక్కా ప్రొఫెషనల్‌ అని నిరూపించారు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో నటించిన విజయ్‌పై గతంలో అనసూయ ట్విటర్‌లో విమర్శలు చేశారు. ఈ విషయాన్ని మర్చిపోయి అనసూయకు తన సినిమాలో అవకాశం ఇచ్చారు విజయ్‌.

దీని గురించి అడిగినప్పుడు.. ‘క్షమించే స్వభావం ఉన్న వ్యక్తిని నేను. మా సినిమా కోసం అనసూయను ఎంపిక చేసింది దర్శకుడే. ఆమె అయితేనే ఆ పాత్రకు సరిపోతారని చెప్పాడు. వ్యక్తిగత వివాదాల కంటే పని ముఖ్యం. ఒకవేళ నేనే ఈ సినిమాకు దర్శకత్వం చేసుంటే ఆమెను తీసుకునేవాడినో, కాదో చెప్పలేను. నేను దర్శకత్వం చేయలేదు కాబట్టి ఏ డిపార్ట్‌మెంట్‌లోనూ జోక్యం చేసుకోలేదు. దర్శకుడి ఇష్టప్రకారమే నటీనటుల ఎంపిక జరిగింది. షూటింగ్‌ జరుగుతుండగా ఒక్కసారి కూడా నేను సెట్‌కు వెళ్లలేదు. మా సినిమాలో నటించడానికి అనసూయ అంగీకరించడం సంతోషం కలిగింది. తన పాత్రలో చాలా బాగా నటించింది. షామీర్‌ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా దర్శకుడు అడిగినవన్నీ సమకూర్చాను’ అని విజయ్‌ పేర్కొన్నారు. ఆయన నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’. సినిమా నేడు విడుదలయింది. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ హీరో నటించిన ఈ సినిమాకు షామీర్‌ సుల్తాన్‌ దర్శకుడు. (చదవండి: ‘మీకు మాత్రమే చెప్తా’ ఎలా ఉందంటే..)

Advertisement
Advertisement