దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

Telugu Heroes Latest Movie Posters Release During Diwali Festival - Sakshi

దీపావళి సందడిని పురస్కరించుకొని  మన తెలుగు హీరోలు వారి అభిమానులకు పండుగ గిఫ్ట్‌ ఇచ్చారు. మహేశ్‌ 'సరిలేరు నీకెవ్వరు', బాలకృష్ణ ' రూలర్'‌, వెంకీ- నాగచైతన్యల ' వెంకీమామ' , కళ్యాణ్‌రామ్‌ ' ఎంత మంచి వాడవురా' చిత్రాలకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు.

బులెట్‌ బైక్‌పై మహేశ్‌ అదుర్స్‌


సంక్రాంతి కానుకగా వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు సంబంధించి మహేశ్‌ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది. రౌడీల పని పట్టేందుకా అన్నట్లు బులెట్‌ బైకును నడుపుతున్నమహేశ్‌ సీరియస్‌ లుక్‌ అభిమానులకు  పిచ్చెక్కిస్తోంది. ఇందులో మహేశ్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో 13 ఏళ్ల తర్వాత లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా ప్రకాశ్‌రాజ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మండన కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12న థియోటర్లలోకి రాబోతుంది.

'రూలర్‌'గా గర్జిస్తానంటున్న బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర టైటిల్‌, బాలకృష్ణ కొత్త లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. తాజా చిత్రానికి 'రూలర్‌' అనే పేరును ఖరారు చేశారు. ఇందులో బాలకృష్ణ 'ధర్మ' అనే పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకోగా, తాజాగా రిలీజైన పోస్టర్‌ అభిమానుల్ని అలరిస్తోంది. సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహన్‌, వేదిక హీరోయిన్‌లుగా నటిస్తుండగా ప్రకాశ్‌రాజ్‌ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్‌ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అదరగొడుతున్న మామా అల్లుడి లుక్‌


విక్టరీ వెంకటేశ్‌, నాగచైతన్య మొదటిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ' .  కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా వెంకీ, చైతూలకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా రిలీజ్‌ చేసిన లుక్‌లో వెంకీ సాధారణ దుస్తుల్లో సాల్ట్‌ అండ్‌ పెపర్‌ లుక్‌తో, నాగచైతన్య ఆర్మీ అధికారిగా కనిపించారు. దసరాను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన టీజర్‌కు విశేష స్పందన రాగా, తాజాగా రిలీజ్‌ చేసిన లుక్‌ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. సురేశ్‌ ప్రొడక‌్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విడుదలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

సంక్రాతికి కలుద్దామంటున్న' ఎంత మంచి వాడవురా'


శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సతీష్‌ వేగేశ్న నందమూరి కళ్యాణ్‌రామ్‌తో 'ఎంత మంచి వాడవురా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సంక్రాంతికి కలుద్దాం అంటూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్‌ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్‌ నటులు శరత్‌బాబు, సుహాసిని, నరేష్‌, విజయ్‌కుమార్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శతమానం భవతి చిత్రంతో మంచి హిట్‌ అందుకున్న సతీశ్‌ ఆ మ్యాజిక్‌ను రిపీట్‌ చేస్తాడా లేదా అనేది చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top