రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం

రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం


‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్‌లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలి’’ అని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు.

 

 ‘‘అన్ని రంగాల్లో జరిగినట్లే సినీరంగంలో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. దీనిలోని ఆంతర్యమేంటో బయటపెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ వివక్ష తగదు. ఇక్కడి నిర్మాతల సంఖ్య పెంచుకోవడం కోసం, తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి’’ అని కోరారు. తెలంగాణ నేలపై సినిమాలు తీస్తూ, తెలంగాణవారి సినిమాను ఓ ప్రాంతీయ సినిమాగా అభివర్ణించడం సరికాదని,

 

 ఇలాంటి చర్యలు తక్షణం విడనాడి తెలంగాణ సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తక్షణం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయాక సినీ పరిశ్రమ కలిసి ఉండటం అసాధ్యమని సంగిశెట్టి దశరథ పేర్కొన్నారు. ఇంకా ప్రేమ్‌రాజ్, కుమార్ మాట్లాడారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top