డ్రీమ్‌ వారియర్‌ సంస్థలో సిబిరాజ్‌

Sibiraj Next To Be Produced By Dream Warrior Pictures - Sakshi

తమిళ సినిమా : ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా రాణిస్తున్న డ్రీమ్‌వారియర్‌ పిక్చర్స్‌ సంస్థలో యువ నటుడు సిబిరాజ్‌ నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీ హీరోగా కాష్మోరా, ధీరన్‌ అధికారం ఒండ్రు వంటి భారీ చిత్రాలతో పాటు జోకర్, అరివి వంటి సంచలన విజయాలను సాధించిన చిత్రాలను నిర్మించిన సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌. ఈ సంస్థ ప్రస్తుతం సూర్య హీరోగా ఎన్‌జీకే చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సత్య వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రంలో నటించిన నటుడు సిబిరాజ్‌ ప్రస్తుతం రంగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో సిబిరాజ్‌కు జంటగా నిఖిలా విమల్‌ నటిస్తోంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది.

ఇలా ఉండగా సిబిరాజ్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు మధుభాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన కమల్‌ కన్నన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించిన మధుపాన కడై చిత్రం ఆయనకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఈ చిత్రం 2012లో విడుదలైంది. దాదాపు ఆరేళ్ల తరువాత కమల్‌కన్నన్‌ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. సిబిరాజ్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌ఎస్‌.ప్రకాశ్, ఆర్‌ఎస్‌.ప్రభు నిర్మించనున్నారు. చిత్ర షూటింగ్‌ జూన్‌ నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.  చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top