మైండ్‌ బ్లాక్‌ తర్వాత ‘సూర్యూడివో చంద్రుడివో’

Sarileru Neekevvaru Movie Next Song Suryudivo Chandrudivo on Monday - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’మూవీ ప్రమోషన్స్‌ ఊపందుకున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూవీ టైటిల్‌ సాంగ్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌, ‘మైండ్‌ బ్లాక్‌’సాంగ్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం టీజర్‌, మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. మిలియన్‌ వ్యూస్‌ సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇక ప్రమోషన్‌లో భాగంగా ఐదు సోమవారాలు ఐదు పాటలను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయగా వచ్చే సోమవారం మరో పాటను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

దీనిలో భాగంగా ‘సూర్యుడివో చంద్రుడివో’అంటూ సాగే మెలోడీ పాటను సోమవారం సాయంత్రం 5:04 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించగా దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేశారు. ఈ సందర్భంగా ‘మంగళకరమైన మాధుర్య ప్రధానమైన సంగీతానికి మనిషి తనం తాలూకు  భావోద్వేగం తోడైతే ఇలాంటి పాట పుడుతుంది. చాలా సంతృప్తిగా ఉన్నా ఈ పాట రాసి’అంటూ రామజోగయ్య శాస్త్రి ట్వీట్‌ చేశారు. 

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్‌ సరసన రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. దాదాపు దశాబ్దంన్నర తర్వాత ఈ సినిమాతో లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతీ రీఎంట్రీ ఇస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top