వెండితెరపై భారత్‌ ప్రతీకారం..

Sanjay Leela Bhansali Announce Movie On Balakot Airstrike - Sakshi

యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు ముందంజంలో ఉంటారు. సినిమాలు తీయడమే కాకుండా వారి రికార్డులు వారే తిరగరాసుకుంటారు. ఈ క్రమంలో హిందీలో తాజాగా మరో యదార్థ ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే.

దీనినే కథాంశంగా తీసుకొని సినిమా తీయనున్నట్లు బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్రకటించారు. భూషణ్‌ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘కేదార్‌నాథ్‌’ దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని తెలిపారు. ఈ భారత సైన్య పోరాటాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నామని భూషణ్‌ కుమార్‌ తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలకు ప్రతీకగా ఈ సినిమా నిర్మితమవుతుందన్నారు.

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీనికి ప్రతీకారంగా భారత్‌  ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబులు వర్షం కురిపించి ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే ఆ సమయంలో భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాకిస్తాన్‌ చేతికి చిక్కగా, అనూహ్య పరిణామాల తర్వాత తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. ఆయన ధైర్యసాహసాలను మెచ్చిన భారత ప్రభుత్వం అభినందన్‌కు ‘వీర్‌చక్ర’ పురస్కారాన్ని అందించింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘బాలాకోట్‌- ది ట్రూ స్టోరీ’ సినిమా తీస్తానని ప్రముఖ నటుడు, నిర్మాత వివేక్‌ ఒబెరాయ్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు ఒకే ఘటనపై రెండు రకాల సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top