ప్రఖ్యాత తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రఖ్యాత తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్(90) మంగళవారం రాత్రి చెన్నైలోకన్నుమూశారు. శ్రీనివాసన్ నిర్మించిన నాయకన్ మొట్టమొదటి సారిగా ఆస్కార్కు నామినేట్ అయిన భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది. బాలచందర్, మణిరత్నం వంటి పలువురు దర్శకులకు ఆయన గురువుగా సుపరిచితులు. కమ్యూనిస్టు ఉద్యమనేతగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తమిళ, తెలుగు, హిందీ బాషల్లో ముక్తా పిలిమ్స్ పతాకంపై 67 పైగా చిత్రాలను నిర్మించారు.
నిర్మాతగా దివంగత ముఖ్యమంత్రి కామరాజర్కు సన్నిహితుడిగా, అనంతరం జీకే మూపనార్కు మిత్రుడిగా తమిళనాట గుర్తింపు తెచ్చుకున్నారు. పలు జాతీయ, రాష్ట్ర అవార్డులను పొందిన ఆయన డీఎంకే ఛీప్ కరుణానిధి రచనలో పలు చిత్రాలను తెరకెక్కించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి పది గంటల సమయంలో స్వగృహంలోనే కన్నుమూశారు.
బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల నటులు రజనీకాంత్, కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన సినీ అనుభవమే 70 వసంతాలు. ఆ అనుభవంతో ప్రఖ్యాత హీరోలు శివాజీగణేశన్, జెమినీగణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమలహాసన్ల నుంచి ఈ తరం నటుల వరకూ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందిన ఘనత ముక్తా శ్రీనివాసన్ సొంతం. ఆయన దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాలు.. ముదలాలి, నాలు వెలి నీలం, తామరైకుళం,ఓడి విళైయాడు పాపా, శ్రీరామజయం, నినైవిల్ నిండ్రవన్, అండమాన్ కాదలీ, సిమ్లా స్పెషల్ చిత్రాలు చెప్పవచ్చు. ఈయన నిర్మించిన నాయకన్ చిత్రం కమలహాసన్ సినీ జీవతంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.