కారణం ఏంటంటే!

Keerthy Suresh React On Her remuneration - Sakshi

తమిళ సినిమా: యువ నటి కీర్తీసురేశ్‌ గురించి ఇప్పుడు చర్చ చాలానే జరుగుతోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన నడిగైయార్‌ తిలగం చిత్రంలో కీర్తీసురేశ్‌ నటనను ప్రశంసించని వారుండరంటే అతిశయోక్తి కాదు. నడిగైయార్‌ తిలగం చిత్రం తరువాత కీర్తికి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ఆమె యమ బిజీ అయిపోతుంది లాంటి  ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వేరే రకంగా ప్రచారం జరుగుతోంది. అదేంటంటే కీర్తీసురేశ్‌ కొత్త చిత్రాలను ఒప్పుకోవడం లేదు. పారితోషికం పెంచేసింది లాంటి వదంతులు వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి వాటికి కీర్తీ ఎలా బదులిచ్చిందో చూద్దాం. నడిగైయార్‌ తిలగం చిత్రాన్ని ఒప్పుకోవడానికి ముందే నేను తమిళంలో విజయ్, విక్రమ్, విశాల్‌ లాంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో  నటించడానికి అంగీకరించాను.

అయితే నడిగైయార్‌ తిలగం చిత్రంలో నేను టైటిల్‌ పాత్రలో నటించడంతో ఆ చిత్రానికి అధిక కాల్‌షీట్స్‌ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నాకోసం ఆ మూడు చిత్రాల వారు చాలా సహకరించారు. విజయ్‌తో నటిస్తున్న సర్కార్‌ చిత్రం కోసం కాల్‌షీట్స్‌ కేటాయించినా, నడిగైయార్‌ తిలగం చిత్రం పూర్తి చేయాల్సి ఉండటంతో సర్కార్‌ చిత్ర యూనిట్‌ నా కోసం చాలా రోజులు వెయిట్‌ చేశారు. దీంతో ఆ చిత్రం పూర్తయిన తరువాత సర్కార్‌ చిత్రం షూటింగ్‌కు సిద్ధం అయ్యాను. ఆ తరువాత విశాల్‌తో నటిస్తున్న సండైకోళి–2, విక్రమ్‌తో నటిస్తున్న సామి స్క్వేర్‌ చిత్రాలు వరుసగా పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలను అంగీకరించాలన్న నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణంగా ప్రస్తుతం కథ చెప్పడానికి వస్తున్న దర్శక నిర్మాతలను వెయిటింగ్‌లో పెడుతున్నాను. చేతిలో ఉన్న మూడు చిత్రాలు పూర్తి చేసిన తరువాత కొత్త చిత్రాలపై దృష్టి సారిస్తాను. ఇక పారితోషికం గురించి జరుగుతున్న ప్రచారం గురించి పట్టించుకోను. నా స్థాయికి తగ్గ పారితోషికాన్ని నిర్మాతలే ఇస్తున్నారు అని బదులిచ్చారు కీర్తి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top