
‘‘ప్రతి అమ్మాయిలోనూ ఓ క్వీన్ ఉంటుంది. ఆ క్వీన్ని చూపించడానికి ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు తమన్నా. హిందీ హిట్ ‘క్వీన్’ని తమన్నా ముఖ్యతారగా తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. నీలకంఠ దర్శకత్వంలో మెడియంటే ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ మలయాళ దర్శకుడు కె.పి. కుమారన్ తనయుడు, నిర్మాత మనుకుమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తమన్నా మాట్లాడుతూ– ‘‘ఓ అమ్మాయిని అమ్మాయిగా, మహిళగా కాకుండా ఓ హ్యూమన్ బీయింగ్గా చూపించిన చిత్రం ‘క్వీన్’. హ్యూమన్ ఎమోషన్స్, హ్యూమన్స్ గురించి మాట్లాడిందీ సినిమా. నాకది నచ్చింది. 2014లో ఈ సినిమా విడుదలైనప్పుడు కచ్చితంగా దక్షిణాది భాషల్లో రీమేక్ కావాలని కోరుకున్నా. తెలుగు రీమేక్లో ‘క్వీన్’గా నటించే ఛాన్స్ నాకు దక్కడం హ్యాపీ! తమిళంలో కాజల్, కన్నడలో పరుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ చేస్తున్నారు.
మా అందరికీ ఓ వాట్సప్ గ్రూప్ ఉంది. అందులో సినిమా, సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కథ పరంగా హిందీకి, తెలుగుకి 90 శాతం మార్పులు లేవు. ‘క్వీన్’ అంటే కంగానా రనౌతే. నేను ఆమెకు పెద్ద ఫ్యాన్. రీమేక్ చేస్తున్నప్పుడు కంపేరిజన్స్ వస్తాయని తెలుసు. వాటిని పక్కన పెట్టి మా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. తెలుగులో హీరోయిన్స్ కమర్షియల్ సినిమాలే చేస్తారనీ, నాలుగు పాటలకు, సన్నివేశాలకు పరిమితమవుతారనీ అందరూ అంటుంటారు. నాకు విభిన్న పాత్రలు చేసే అవకాశం లభించింది. సో, నా దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. నీలకంఠ మాట్లాడుతూ– ‘‘హిందీ ‘క్వీన్’ చూసినప్పుడు సినిమా చూస్తునట్టు కాకుండా ఓ జీవితాన్ని చూసినట్టనిపించింది.
కథలో, కథనంలో, సిన్మా తీసిన విధానంలో ఓ నిజాయితీ ఉంది. అదే వందకోట్ల వసూళ్లను, జాతీయ అవార్డులను తెచ్చింది. లైఫ్లో తనకు జరిగిన విషాదాన్ని పక్కనపెట్టి రాణి అనే ఓ అమ్మాయి ఎలా ముందుకు వెళ్లిందనేది చిత్రకథ. తెలుగు రీమేక్కి తమన్నా తప్ప మరొకరు మాకు రాణిగా కనిపించలేదు. ఈ సినిమాతో నేను మలయాళంలో దర్శకుడిగా పరిచయమవుతున్నా’’ అన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేస్తామని చిత్రనిర్మాత మనుకుమారన్ తెలిపారు.