తెరి దర్శకుడితో కార్తీ?

తెరి దర్శకుడితో కార్తీ? - Sakshi


తెరి చిత్ర దర్శకుడితో కలిసి పనిచేయడానికి నటుడు కార్తీ రెడీ అవుతున్నారా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం లేకపోలేదనే సమాధానం వస్తోంది. తొలి చిత్రం రాజారాణితోనే తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అట్లీ. శంకర్ శిష్యుడైన ఈయన తన రెండో చిత్రంతోనే విజయ్ వంటి స్టార్ హీరోతో పనిచేసి ఆయనకు అద్భుత విజయాన్ని అందించి తనూ క్రేజీ దర్శకుడిగా ఎదిగారు. ఆ చిత్రమే తెరి. కాగా ఆ చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న దర్శకుడు అట్లీ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు.



తన తాజా చిత్ర వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెరి సక్సెస్ మీట్‌లో చెప్పారు. అందుకు సమయం ఆసన్నమైనట్లు సమాచారం. యువ నటుడు కార్తీని తన తాజా చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాణం ప్రస్తుతం చర్చల్లోనే ఉన్నట్లు తెలిసింది.



కార్తీ ప్రస్తుతం కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. గోకుల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, శ్రీదివ్య కథానాయికలుగా నటిస్తున్నారు. తదుపరి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు నాయకిగా నటించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఆ తరువాత అట్లీ దర్శకత్వంలో నటించే చిత్రం ఉండే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top