అదిరిపోయే ఫుడ్‌ ఆఫర్లు..

New Year Food Offers At hyderabad - Sakshi

కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్కు వెల్‌కమ్‌ చెబుతాం..

న్యూ ఇయర్‌ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్‌కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ  పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా  పెరుగుతూనే  ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు  ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్‌ క్రీమ్‌ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్‌, ఫుట్‌వేర్‌, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్‌).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్‌. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు.  ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్‌ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్‌ ఫెస్టివల్స్‌ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్‌కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..

ఆఫర్లే ఆఫర్లు...
నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్​లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్‌లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు  సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్‌లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్‌టైల్స్, మాక్‌టైల్స్‌ను రుచి చూపించనున్నాయి.

నాన్‌ వెజ్‌ ఆఫర్లు..
ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్‌ వెజ్‌ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్‌ వెజ్‌ లవర్స్‌ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్‌, మటన్‌, మష్రూమ్‌,ఫిష్‌ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్‌లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్‌లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి.  

ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీసింగ్‌....
ఆన్‌లైన్‌ ఫుడ్‌​ సర్వీస్‌లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్‌లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలీవరీ యాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్‌లైన్‌ ఫుడ్‌ సర్వీస్‌లను డిమాండ్‌ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఐటమ్‌ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది.  అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది.

ఫేమస్‌ ఫుడ్‌ యాప్‌లు
ఆన్‌లైన్‌ ఫుడ్‌ యాప్‌లో  స్విగ్గీ, జొమాటో, ఉబర్‌ ఈట్స్‌, ఫుడ్‌ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే  ఫుడ్‌లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్​ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్‌ వస్తుండటంతో ఈ యాప్‌లకు క్రేజ్‌ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్‌ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన  ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి.  

ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. 
కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్‌లు,ఫ్యామిలీ ప్యాక్‌ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ  ఈయర్‌కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్‌ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం...

జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్‌లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్‌ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్‌పై 50 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. టాప్‌ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్‌ను అప్లై చేయాలి. కోటక్‌ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్‌ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్  పేరుతో  రూ .500 విలువైన ఆహార ఆర్డర్‌లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే.

స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్‌ ద్వారా ఇస్తోంది.  

ఉబర్‌ ఈట్స్‌.. ఉబర్‌ రైడ్‌లతోపాటు ఉబర్‌ ఈట్స్‌ ఆహార డెలివరీ యాప్‌  ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలక్టెడ్‌ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్‌ అవసరం లేదు. నేచురల్‌ ఐస్‌ క్రీం నుంచి కప్‌ ఐస్‌ క్రీమ్‌నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్‌ షేక్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది.  HYDFEAST50, HYDFEAST30,  HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్‌ను ఇస్తుంది 

బేకరీల్లో బారులు..
న్యూయర్‌ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్‌, నాన్‌ వెజ్‌, పేస్ట్రీస్‌ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వర​కు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్‌లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు.  బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి.  అంతేగాక వీటికి 500 ఎంఎల్‌ కూల్‌డ్రింక్‌, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్‌ ఆఫర్లను ఆరగించండి..

- గుండా భావన (వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top