
వాషింగ్టన్: అమెరికన్లకు రక్షణ కల్పించేందుకు ఇమిగ్రేషన్ వ్యవస్థలో లోపాలను సరి చేయాలని, గొలుసుకట్టు వలసదారులకు అడ్డుకట్ట వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ను కోరారు. సోమవారం ఐఎస్ఐఎస్ ప్రేరణతో ఓ బంగ్లాదేశ్ జాతీయుడు న్యూయార్క్ నగరంలోని ఓ రద్దీ మెట్రో స్టేషన్లో పేలుడుకు పాల్పడిన నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అనుమానితుడైన అకాయద్ ఉల్లాహ్(27) తన శరీరానికి పైప్ బాంబ్ను ఉంచుకుని, రెండు సబ్వే ప్లాట్ఫామ్స్ వద్ద దీనిని పేల్చాడు.
ఈ ఘటనలో అనుమానితునితో పాటు నలుగురు గాయపడ్డారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ‘గత రెండు నెలల వ్యవధిలో న్యూయార్క్లో జరిగిన రెండో ఉగ్ర దాడి ఇది. అందువల్ల అమెరికన్ల రక్షణను దృష్టిలో ఉంచుకుని చట్ట సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను’అని పేర్కొన్నారు. అనుమానితుడు ఉల్లాహ్ ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి ఫ్యామిలీ వీసాపై అమెరికా వచ్చాడు. ముందుగా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించాల్సి ఉందని, ప్రమాదకరమైన, అర్హతలేని వారు దేశంలోకి ప్రవేశిస్తున్నారని ట్రంప్ చెప్పారు.