బంగ్లాదేశ్ విషయంలో సౌదీ అరేబియా మనసు మార్చుకుంది. ఆ దేశం నుంచి ఎవరినీ పనిలోకి తీసుకోకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
రియాద్: బంగ్లాదేశ్ విషయంలో సౌదీ అరేబియా మనసు మార్చుకుంది. ఆ దేశం నుంచి ఎవరినీ పనిలోకి తీసుకోకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఎత్తేసినట్లు ఢాకా అధికార ప్రతినిధి గులామ్ మోషి చెప్పారు. గత జూన్ నెలలో తమ దేశ ప్రధాని షేక్ హసీనా, సౌదీ రాజు సల్మాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, దాని ప్రకారమే తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారని చెప్పారు.
దీంతో తమ దేశం నుంచి నైపుణ్యంగల ఉద్యోగులు, నైపుణ్యం లేని శ్రామికులు సౌదీలో పనిచేసేందుకు వీలైందని పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయులు, వ్యవసాయం చేసేవాళ్లు, భవన నిర్మాణ కార్మికులు ఇక ఉపాధి కోసం సౌదీకి వెళ్లవచ్చని అన్నారు. ఇప్పటికే మొత్తం 48 రంగాల్లో తమ దేశం నుంచి అక్కడ పనిచేసేందుకు తమ వాళ్లు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.