
లండన్: రోజురోజుకూ పెరిగిపోతున్న వాయుకాలుష్యంతోపాటు.. ప్లాస్టిక్ కాలుష్యం కూడా మనల్ని వణికిస్తోంది. ప్రస్తుతం ఏది కొన్నా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్లోనే ఇస్తున్నారు. అది మట్టిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతోంది. ప్లాస్టిక్ వల్ల సముద్ర జీవావరణం దెబ్బతింటుంది. అంతేగాక నీటిపై ఒక తెట్టులాగ ఏర్పడి జీవుల మనుగడకు ప్రతిబంధకంగా తయారైంది. వీటిని ఎలా డీగ్రేడ్ చెయ్యాలి అనే అంశంపై శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పరిశోధనలు చేస్తుండగా.. ఈ ప్లాస్టిక్ను తినే జీవులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్లైమౌత్ యూనివర్సిటీ సముద్ర శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్కిస్టా గమ్మారేల్లస్ అనే ఒక సూక్ష్మజీవి ఒక ప్లాస్టిక్ బ్యాగును 10 లక్షల ముక్కలుగా చేస్తుందట. ఆర్కిస్టా ఎక్కువగా ఉత్తర, పశ్చిమ యూరప్లలో బాగా విస్తరించి ఉందట. ఇదిలాఉండగా... ఏటా సముద్రాల్లో 12 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయి. ఇదే అతి పెద్ద కాలుష్యానికి కారణమని శాస్త్రవేత్త రీచర్డ్ థాంమ్సన్ వెల్లడించారు.