భవిష్యత్‌ మహమ్మారి జీ4..! | New Virus In Pigs In China | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ మహమ్మారి జీ4..!

Jul 5 2020 7:55 AM | Updated on Jul 5 2020 12:25 PM

New Virus In Pigs In China - Sakshi

చైనాలో పుట్టి ప్రపంచమంతా చుట్టేసిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ కిందామీదా పడుతోంటే.. అదే చైనాలో సరికొత్త వైరస్‌ ఒకదాన్ని శాస్త్రవేత్తలు పందుల్లో గుర్తించారు. జీ4 అని పిలుస్తున్న ఈ వైరస్‌ ప్రస్తుతానికి మనుషులకు సోకే అవకాశం లేకున్నా.. భవిష్యత్తులో ఇది కరోనా మాదిరే మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పందుల్లో అటు పక్షి సంబంధ, ఇటు క్షీరద సంబంధ వైరస్‌లు రెండూ ఉంటాయి. ఇలా రెండు రకాల వైరస్‌లు ఒకే జంతువులో ఉన్నప్పుడు ఒకదాంట్లోని జన్యువులు ఇంకోదాంట్లోకి చేరుతుంటాయి. ఫలితంగా కొత్త రకాల వైరస్‌లు పుడుతుంటాయి. ఇవి ఏదో ఒక దశలో జంతువుల నుంచి క్షీరదాలైన మనుషులకూ సోకే అవకాశం ఉంటుంది. చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని హోంగ్లీసన్‌ అనే శాస్త్రవేత్త ఇటీవల పందులపై జరిపిన పరిశోధనల ద్వారా జీ4 ఉనికి బహిర్గతమైంది. దీంట్లో కనీసం మూడు ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌ల జన్యుపదార్థం కలిసిపోయి ఉంది. (చైనాకు చెక్‌ : మరోసారి మోదీ మార్క్‌)

. యూరప్, ఆసియా పక్షుల్లోని వైరస్‌ ఒకటి కాగా, ఎగిరే పక్షులు, మనుషులు, పందుల వైరస్‌లు కలిగి ఉన్న నార్త్‌ అమెరికన్‌ రకం మరొకటి. 2011 –2018 మధ్యకాలంలో హోంగ్లీసన్‌ పది చైనా ప్రావిన్స్‌ల్లోని జంతు వధశాలల్లో పందుల ముక్కుల్లోని స్రావాల నమూనాలు సేకరించి ఈ పరిశోధనలు నిర్వహించారు. శ్వాస సంబంధ సమస్యలున్న వెయ్యి పందుల నమూనాలను కూడా విశ్లేషించారు. వీటిలో జీ4తోపాటు కనీసం 179 ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌లు ఉన్నాయని, 2016 తరువాత సేకరించిన నమూనాల్లో ఇవి మరిన్ని ఎక్కువున్నాయని హోంగ్లీసన్‌ అంటున్నారు. జీ4 ఇప్పటికే మనుషులకు సోకుతున్నా అది మహమ్మారి స్థాయిలో లేదని, భవిష్యత్తులో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. పందులను పెంచేచోట్ల ఉన్న మనుషుల్లో ఈ జీ4 వైరస్‌ యాంటీబాడీలు కూడా గుర్తించడం ఇంకో విశేషం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement