దశాబ్ధాల తర్వాత దాయాదులు తొలిసారిగా..

India And Pakistan To Take Part In First Ever Joint Military Exercises - Sakshi

బీజింగ్‌ : 1947లో వేర్వేరు దేశాలుగా అవతరించిన తర్వాత భారత్‌, పాకిస్తాన్‌లు తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో రష్యాలో జరగనున్న శాంతి ప్రక్రియ కసరత్తులో భాగంగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ)లో ఇతర సభ్య దేశాలతో కలిసి భారత్‌, పాక్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. బీజింగ్‌లో 15వ ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పీస్‌ మిషన్‌ 2018లో భారత్‌ పాల్గొంటుందని ప్రకటించారు.

అణు సామర్ధ్యం కలిగిన దక్షిణాసియా దేశాలు ఈ తరహా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా, చైనా సహా ఎస్‌సీఓ సభ్య దేశాలన్నీ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఎస్‌సీఓలో గత ఏడాది భారత్‌, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని స్వీకరించాయి. గతంలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన పలు ఐరాస శాంతి మిషన్స్‌లో భాగంగా భారత్‌, పాక్‌ సైనికులు కలిసి పనిచేసినా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం​మాత్రం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతో పరస్పర ద్వైపాక్షిక సహకారానికి భారత్‌ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మరోవైపు సైనిక విన్యాసాల్లో పాకిస్తాన్‌ పాల్గొంటుందని పాక్‌ అధికారులు ధృవీకరించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top