భారత్‌ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి | China Slams India New FDI Rules | Sakshi
Sakshi News home page

భారత్‌ కొత్త నిబంధనలపై చైనా అసంతృప్తి

Apr 20 2020 2:35 PM | Updated on Apr 20 2020 3:01 PM

China Slams India New FDI Rules - Sakshi

బీజింగ్‌ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విషయంలో భారత్ కీలక మార్పులు చేయడంపై చైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితిని ఆసరాగా చేసుకుని చైనా సహా పొరుగుదేశాలు 'ఆవకాశవాద టేకోవర్'లకు పాల్పడకుండా భారత్‌ కఠిన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియాతో సరిహద్దులు పంచుకునే చైనా సహా పొరుగుదేశాలు ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న, లేదా భవిష్యత్తు ఎఫ్‌డీఐల (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) విషయంలోనూ ఓనర్‌షిప్ బదిలీలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. (కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!)

అయితే ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌లో కొత్తగా చోటుచేసుకున్న మార్పులు డబ్ల్యూటీఓ సూత్రాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని చైనా పేర్కొంది. పక్షపాతంలేకుండా, స్వేచ్ఛా, న్యాయమైన వాణిజ్యం వంటి డబ్ల్యూటీఓ సూత్రాలకు భారత్‌ నిర్ణయం పూర్తి వ్యతిరేఖమని సోమవారం చైనా తెలిపింది. కొత్త నియమనిబంధనలతో చైనా పెట్టుబడిదారులపై తీవ్ర ప్రభావం పడనుందని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్ ఓ ప్రకటనలో తెలిపారు. వివ‌క్ష పూరిత నూత‌న విధానాల‌ను భార‌త్ మారుస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్యక్తం చేశారు. వివిధ దేశాల నుంచి వ‌చ్చే పెట్టుబ‌డుల‌ను స‌మంగా చూడాల‌ని ఆయ‌న కోరారు.(డ్రాగన్ దేశానికి ట్రంప్ హెచ్చరిక)

Advertisement
 
Advertisement
Advertisement