
‘వాటర్ ఫెస్టివల్’ లో 285మంది మృతి
మయన్మార్లో జరిగిన సంప్రదాయ వాటర్ ఫెస్టివల్లో 285 మంది మృతి చెందారు.
యాంగాన్: మయన్మార్లో జరిగిన సంప్రదాయ వాటర్ ఫెస్టివల్లో 285 మంది మృతి చెందారు. నాలుగురోజుల పాటు జరిగిన ఈ వేడుకలో మరో 1073మంది గాయపడ్డారు. మయన్మార్ కొత్త సంవత్సరంలో వేసవి ముగుస్తుందనగా ఈ వేడుకను అక్కడి ప్రజలు జరుపుకుంటారు. ఈ పండుగ పేరు ‘థింగ్యాన్’. బౌద్ధ మతంను అనుసరిస్తూ ఈ ఫెస్టివల్ ను జరుపుతారు. గత ఏడాది చేసిన పాపాలు ఈ ఏడాది నూతన సంవత్సరంలో నీటితో కడిగేసుకుంటే పోతాయనేది మయన్మార్ ప్రజలు విశ్వసిస్తారు. రోడ్డు మీద వెళ్లే వారిపై లీటర్లకు లీటర్లు నీళ్లను కొడుతూ అక్కడి ప్రజలు ఈ వేడుకను ఘనంగా ముగించారు.
కాగా గత సంవత్సరం జరిగిన ఈ ఫెస్టివల్ సందర్భంగా 272 మంది చనిపోతే 1086మంది గాయపడ్డారు. అంటే ఈసారి మృతుల సంఖ్య 13 ఎక్కువ. ఈ సందర్భంగా 1200 క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా పేర్కొంది. వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 44 మంది వరకు మొత్తం 285 మంది చనిపోయారు. క్రిమినల్ కేసుల్లో హత్య, కారు యాక్సిడెంట్లు, డ్రగ్స్ వాడకం, దొంగతనాలు, హింస, ఆయుధాలు కలిగి ఉండడం వంటివి ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.