11న టీఆర్‌ఎస్‌లోకి గాంధీ, గోపీనాథ్!!

11న టీఆర్‌ఎస్‌లోకి  గాంధీ, గోపీనాథ్!! - Sakshi


ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు



 సాక్షి, హైదరాబాద్: టీటీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముహూర్తం కుదిరింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈనెల 11వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి తిరిగి వచ్చాక దాదాపు ఏడున్నర గంటల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయనను కలసి చర్చించారు. తమ చేరికకు గ్రీన్‌సిగ్నల్ తీసుకుని... ఇందుకు 11వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారు.



సీఎం కేసీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. అయితే మాగంటి గోపీనాథ్ సోమవారం ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలసి తమ చేరిక గురించి చర్చించారు. మంగళవారం అరికెపూడి గాంధీతో కలసి మరోసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారితే.. ఇక తెలంగాణ టీడీపీకి మిగిలేది ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే కావడం గమనార్హం. కాగా, టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో చేర్చాలంటూ స్పీకర్‌కు లేఖ ఇచ్చిన ఎర్రబెల్లికి మాగంటి, అరికెపూడి మద్దతు తెలిపారని సమాచారం. విలీనానికి తాము కూడా అంగీకారం తెలుపుతున్నామని రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top