ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు లేకపోవడంతో ఏపీకి ఆప్షన్ ఇచ్చినా తెలంగాణకు కేటాయించిన 329 మంది ఉద్యోగులు తిరిగి ఆంధ్రాకు వచ్చే అవకాశం ఏర్పడింది.
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు లేకపోవడంతో ఏపీకి ఆప్షన్ ఇచ్చినా తెలంగాణకు కేటాయించిన 329 మంది ఉద్యోగులు తిరిగి ఆంధ్రాకు వచ్చే అవకాశం ఏర్పడింది. వారికోసం సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ఆర్థిక, రాష్ట్ర పునర్విభజన విభాగం అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకోవాలని సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇందుకు ఆర్థిక శాఖ కూడా సుముఖత వ్యక్తం చేసింది. 329 మందిని తీసుకున్నప్పటికీ అన్ని సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదని, కొంత మంది పదవీ విరమణ చేయడంతో పాటు మరి కొంత మంది తెలంగాణ నుంచి రాకపోవచ్చుననే అభిప్రాయం సమీక్షలో వ్యక్తమైంది.