నిండు గర్భిణిపై అత్యాచారం.. హత్య | Rape and murder of a pregnant woman in full | Sakshi
Sakshi News home page

నిండు గర్భిణిపై అత్యాచారం.. హత్య

Oct 5 2014 2:43 AM | Updated on Jul 28 2018 8:51 PM

నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతు నులిమి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది.

నగర శివార్లలో దారుణం

హైదరాబాద్: నిండు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతు నులిమి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకుంది. నిందితుడు ఆమె కన్నబిడ్డ ఎదుటే ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం చేసిన తర్వాత మహిళను హత్యచేసి, ఆమె బిడ్డ కాళ్లకు ఉన్న పట్టీలు, అల్మరాలో దాచిన నగదు తీసుకొని ఉడాయించాడు. గోడదూకి వస్తున్న నిందితుడిని స్థానికులు పట్టుకొని చితకబాదగా, అతడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడని మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎన్. జావీద్ శనివారం తెలిపారు. కర్ణాటకకుచెందిన రమాదేవి (35) నగరానికి వలసవచ్చి మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని బుద్వేల్ రైల్వేస్టేషన్ నర్సింగ్ రావు బస్తీలో ఉంటోంది. ఆమె భర్త కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.

దీంతో ఆమె కూలీ పనిచేస్తూ కుమార్తె స్రవంతి(7)ని పోషిస్తోంది. రమాదేవి ప్రస్తుతం 9 నెలల గర్భిణి. వీరు ఉంటున్న ఇంటిపక్కనే ఓ లారీ పార్కింగ్ గ్యారేజ్ ఉంది. శనివారం తెల్లవారుజామున ఓ గుర్తుతెలియని వ్యక్తి గ్యారేజ్ గోడ దూకి రమాదేవి ఇంట్లోకి చొరబడి దారుణానికి పాల్పడాడు. రమాదేవి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనాథగా మారిన స్రవంతిని పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement