
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ ప్రజల కోసమే ఆవిర్భవించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) తెలిపారు. శనివారం హైదరాబాద్ మల్కాజిగిరి కృష్ణలీల ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేపీ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావడానికి సమయం పడుతుందన్నారు.
ఇప్పటి రాజకీయాలకు అర్థాలే వేరుగా ఉన్నాయన్నారు. కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించడం కన్నా వసూళ్లకు పాల్పడటం, ఇతరత్రా పనులు చేయడమే రాజకీయం అనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో మూడు రాజ్యాంగ సవరణలు, 2జీ స్పెక్ట్రమ్ కేసు, 8 చట్టాలు చేయించిన ఘనత పార్టీకి ఉందన్నారు.
రాష్ట్రం లో యజ్ఞాలు చేస్తేనే అన్నీ అయిపోవన్నారు. కేంద్రంలో మోదీ విజ్ఞతతో పనిచేయకపోవడం తో ఆయనపై నమ్మకం పోయిందన్నారు. ఆవు గురించి, తలాక్ల గురించి ఆలోచించే నేతలకు కోట్ల మంది జీవితాల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే సురాజ్య యాత్ర నిర్వహిస్తామన్నారు.