అడ్డుగా ఉన్నాడని.. చంపించింది..! | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడని.. చంపించింది..!

Published Thu, May 19 2016 5:27 PM

husband murdered by wife over Illicit relationship

మియాపూర్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య కిరాయి హంతకులతో అంతం చేసింది. తన చేతికి మట్టి అంటకుండా పక్కాగా ప్లాన్ చేసినా.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన  మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను కూకట్‌పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు...మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లూర్‌కు చెందిన డి.అంకుశ్ (24), అంబిక భార్యాభర్తలు. అయితే బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం అంకుశ్ ఒక్కడే హైదరాబాద్‌లో ఉంటున్న తన బాబాయి వద్దకు వచ్చాడు. స్వగ్రామంలోనే ఉన్న అంబిక.. సూర్యకాంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తన సంతోషానికి అడ్డు ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే భర్తతో మాట్లాడుతూ  అతని కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తోంది. వారిద్దరూ కలసి అంకుశ్‌ను చంపేందుకు ప్రణాళిక వేసుకున్నారు.

ఈ మేరకు అదే గ్రామానికి చెందిన తుకారాం, ప్రకాశ్ అనే వారికి రూ.1.30 లక్షల సుపారీ ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా వారికి రూ.10 వేలు ఇచ్చి వారిని హైదరాబాద్ కు పంపింది.  ఈ మేరకు 9వ తేదీ రాత్రి ప్రకాశ్, తుకారాంలు మియాపూర్‌లో అంకుశ్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మద్యం దుకాణం వద్దకు అతడిని తీసుకెళ్లారు. మద్యం తాగిన అనంతరం అదను చూసుకుని తలపై రాయితో మోది చంపేశారు. ఈ ఘటనపై ఈ నెల 10 వ తేదీన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి భార్యనే ముద్దాయి అని తేల్చారు. నిందితులు సూర్యకాంత్, తూకారాంలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  పరారీలో ఉన్న 1అంబికా, ప్రకాశ్‌ల కోసం గాలిస్తున్నారు.

 

Advertisement
Advertisement